Andhra Pradesh : ఏపీ నుంచి ఇద్దరు మహిళా రైతులు యూరప్కు.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పార్వతీపురం మన్యం జిల్లా దురుబిలికి చెందిన ఆరిక నరసమ్మ,అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సంతపాలేనికి చెందిన లాలం జ్యోతి అనే ఇద్దరు మహిళా రైతులకు యూరప్లో పర్యటించే అరుదైన అవకాశం లభించింది. వీరు జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, పోలండ్, బెల్జియం సహా మొత్తం ఏడు దేశాల్లో 30 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయా దేశాల్లోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆర్గానిక్ ట్రేడ్ ఫెయిర్లను సందర్శించి, అక్కడ అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
వివరాలు
ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఫార్మింగ్ సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ పర్యటన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా, ప్రకృతి వ్యవసాయం చేస్తూ విశేష ఫలితాలు సాధిస్తున్నందుకు ఈ ఇద్దరు మహిళా రైతులను ఎంపిక చేసినట్లు రైతు సాధికార సంస్థ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీరి వెంట అధికారులు యర్రకొండ సుధాకర్, స్వాతి కూడా మంగళవారం యూరప్కు బయల్దేరనున్నారు. బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఫార్మింగ్ సంస్థ ఈ అంతర్జాతీయ పర్యటనను నిర్వహిస్తోంది.