Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్లో యూడీఎఫ్ ఛార్జీలు ఖరారు.. ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం సమీపంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారితో పాటు, ఇతర ప్రాంతాల నుంచి ఈ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికుల నుంచి కూడా యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) వసూలు చేయనున్నారు. ఈ మేరకు విమానాశ్రయాల టారిఫ్ నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) నిర్ణయించిన యూడీఎఫ్ ఛార్జీలను విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీవీఐఏఎల్) బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. కొత్త విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన తేదీ నుంచే ఈ యూడీఎఫ్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.
వివరాలు
యూడీఎఫ్ ఛార్జీలు
ఏఈఆర్ఏ నిర్ణయం ప్రకారం, భోగాపురం విమానాశ్రయం నుంచి దేశీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు రూ.835, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు రూ.1,255 చొప్పున యూజర్ డెవలప్మెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే దేశీయ ప్రాంతాల నుంచి భోగాపురం విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు రూ.355, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు రూ.545 యూడీఎఫ్గా వసూలు చేయనున్నారు.