LOADING...
Umar Khalid: దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్‌ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్
దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్‌ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్

Umar Khalid: దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్‌ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

2020 దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖాలిద్‌కు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఖాలిద్‌ తల్లికి శస్త్రచికిత్స జరగనున్న నేపథ్యంలో ఆమెను పరామర్శించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఉమర్‌ ఖాలిద్‌ గత ఆరేళ్లుగా జైలులోనే ఉన్నాడు. తన మామ మరణానంతర కర్మకాండల్లో పాల్గొనడంతో పాటు, శస్త్రచికిత్స చేయించుకోనున్న తల్లిని కలిసేందుకు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ముందుగా ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ అతడి విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. దీంతో ఖాలిద్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

వివరాలు 

పోలీసులకు హైకోర్టు సూచనలు 

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌, జస్టిస్‌ మధు జైన్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం జూన్‌ 1 నుంచి మూడు రోజులపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో ఉమర్‌ ఖాలిద్‌ తన నివాసంలోనే ఉండాలని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని మాత్రమే కలవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని ఆదేశించింది. అలాగే రూ.1 లక్ష పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది. అతడి కదలికలపై కఠిన నిఘా కొనసాగించాలని పోలీసులకు హైకోర్టు సూచించింది.

Advertisement