Fake Medicines: ఢిల్లీ నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు మేరకు ఢిల్లీ 'నకిలీ మందుల' కేసులో సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ సీబీఐని ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం గురువారం నకిలీ డ్రగ్స్ వ్యవహారాన్ని సీబీఐ విచారణ కోసం హోం మంత్రిత్వ శాఖకు సూచించిన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతంలో దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. ఈ కేసుపై దర్యాప్తును అభ్యర్థించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందులపై ఢిల్లీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకుంది.
నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం
సరఫరా నుండి తొలగించాల్సిన ఐదు మందులు ఇవే..
నివేదిక ప్రకారం,విజిలెన్స్ విభాగం ప్రముఖ ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులైన LNJP, DDU,IHBAS నుండి సేకరించిన నాసిరకం మందుల నమూనాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. విజిలెన్స్ విభాగం డ్రగ్స్ నాణ్యత లేనివిగా నిర్ధారించారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ కొన్ని మందులను స్టాండర్డ్ క్వాలిటీగా లేనందున వాటిని వెనక్కి తీసుకోవాలని కోరింది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆదేశాల తర్వాత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదివారం నగరంలోని ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలలో మందుల కొరతను నివారించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖను కోరారు. అమ్లోడిపైన్ (హై బ్లడ్ ప్రెషర్), లెవెటిరాసెటమ్ (మూర్ఛ కోసం), పాంటోప్రజోల్ (కడుపులో గ్యాస్), సెఫాలెక్సిన్ (యాంటీబయోటిక్), డెక్సామెథాసోన్ (స్టెరాయిడ్) సరఫరా నుండి తొలగించాల్సిన ఐదు మందులలో ఉన్నాయి.