Uttarakhand: నైనిటాల్ సమీపంలో పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి
ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఈరోజు చెదాఖాన్-మిదర్ మోటార్ రహదారిపై పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 8 గంటలకు వాహనం పట్లోట్ నుండి అమ్జాద్ గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని నైనిటాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్నితప్పించే ప్రయత్నంలో వాహనం వాగులో పడిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా,ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ఓఖల్కండలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్చినట్లు ఎస్ఎస్పీ తెలిపారు.