
Vijay: విజయ్ రాజకీయ యాత్రకు శ్రీకారం.. రెండో వారంలో ప్రజల్లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
రాజకీయంగా మరింత బలపడేందుకు 42 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని ఆయన సంకల్పించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రజలతో నేరుగా ముఖాముఖి అవ్వాలన్నదే విజయ్ ప్రధాన లక్ష్యం.
విజయ్ ఇప్పటికే రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన నాయకత్వంలోని పార్టీలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజాగా వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మద్దతు పొందేందుకు విస్తృత పర్యటనకు ప్లాన్ చేశారు.
జూన్ రెండో వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో పర్యటన ప్రారంభమయ్యే అవకాశముంది.
Details
పర్యటన కోసం ప్రత్యేకంగా ప్రచార రథం
తిరుచ్చి లేదా మదురై నుంచి ఈ పర్యటనను మొదలుపెట్టాలన్న అంశంపై ఆయన ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటన కోసం ప్రత్యేకంగా ప్రచార రథం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
అలాగే జిల్లా స్థాయి నేతల అభిప్రాయాలను కూడా విజయ్ సేకరిస్తున్నట్టు తెలిసింది. పార్టీ అంతర్గతంగా ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు కూడా విజయ్ చర్యలు చేపట్టారు.
2026లో తమ లక్ష్యాన్ని చేరుకోవడమే ప్రధాన టార్గెట్ అని స్పష్టంచేశారు విజయ్.
విపక్షాల విమర్శలపై సమాధానం ఇవ్వడంలో సమయాన్ని వృథా చేయకుండా, ప్రజల సమస్యలపై దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో విజయ్ ఈ అడుగు మరింత చర్చకు దారితీయనుంది.