మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. ఇంఫాల్లోని న్యూ లంబులనే ప్రాంతంలో సోమవారం ఖాళీ చేసిన ఇళ్లను ఒక గుంపు దగ్ధం చేసింది. మంటలను ఆర్పేందుకు భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో ఇళ్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించారు.
టియర్ గ్యాస్ను ప్రయోగించిన బలగాలు
మణిపూర్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, సోషల్ మీడియా ద్వారా విద్వేష ప్రసంగాలు ప్రసారం కాకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలపై నిషేదం విధించినట్లు అధికారులు చెప్పారు. ఇంటర్నెట్పై సస్పెన్షన్ ఆర్డర్ మే 26వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఉదయం ఇంఫాల్లోని న్యూ చెకాన్ బజార్ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హింసకు పాల్పడిన గుంపును చెదరగొట్టేందుకు బలగాలు టియర్ గ్యాస్ను ప్రయోగించారు.