Vishaka Utsav: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రుల బృందం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సాంస్కృతిక సంపదను, ప్రకృతి అందాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు 'విశాఖ ఉత్సవ్'ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 'సాగరం నుంచి శిఖరం వరకు' అనే నినాదాన్ని ముందుంచుకుని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రుల బృందం వెల్లడించింది. విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై మంగళవారం విశాఖ కలెక్టరేట్లో మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. అనంతరం వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి తదితరులు ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
వివరాలు
అనకాపల్లి జిల్లాలో ఉత్సవాలు ముగుస్తాయి
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఈ నెల 24న విశాఖపట్నంలో విశాఖ ఉత్సవ్కు శ్రీకారం చుట్టి, ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లాలో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 20 ప్రధాన కేంద్రాల్లో 500కుపైగా సాంస్కృతిక, పర్యాటక కార్యక్రమాలు నిర్వహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్రాజు, కొణతాల రామకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.