Visakhapatnam Port: దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖ పోర్టు అగ్రస్థానం.. సగం ఇక్కడి నుంచే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులకు విశాఖపట్టణం పోర్టు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి జరిగిన మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో 50.87 శాతం వాటా ఒక్క విశాఖ పోర్టు ద్వారానే నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా 29.67 శాతంగా ఉండగా,కేవలం ఏడాదిలోనే 21 శాతానికి పైగా పెరగడం విశాఖ పోర్టు ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
వివరాలు
పార్లమెంటులో గణాంకాలు వెల్లడించిన కేంద్రం
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) గణాంకాలను ఉటంకిస్తూ, 2024 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం 7.38 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసిందని తెలిపారు.
అందులో 2.19 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు విశాఖపట్నం పోర్టు ద్వారానే జరిగినట్లు వెల్లడించారు.
అదే విధంగా, 2025లో దేశ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖ పోర్టు వాటా 50.87 శాతానికి చేరగా, 2026లో కూడా 48.89 శాతం వాటాతో తన ఆధిపత్యాన్ని కొనసాగించినట్లు కేంద్రం తెలిపింది.
దీంతో దేశ సముద్ర ఆహార ఎగుమతులకు విశాఖపట్నం అత్యంత కీలక ఎగుమతి కేంద్రంగా నిలిచిందని స్పష్టం చేసింది.
వివరాలు
ఏపీలో 26 జిల్లాల్లో 99 ఓడీఓపీ ఉత్పత్తులు
ఒక జిల్లా-ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) పథకం అమలులో కూడా విశాఖ పోర్టు కీలక పాత్ర పోషిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో పాల్గొనడం, కొనుగోలుదారులు-అమ్మకందారుల సమావేశాలు నిర్వహించడం, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు కొత్త అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో మొత్తం 99 ఓడీఓపీ ఉత్పత్తులను గుర్తించినట్లు కేంద్రం తెలిపింది.
స్థనిక పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొంది.
ఈ చర్యల ఫలితంగా ప్రపంచ మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల పోటీతత్వం మరింత బలోపేతమవుతోందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.