Page Loader
Indiramma Housing Scheme : ఇందిరమ్మ లబ్ధిదారులకు వార్నింగ్.. ఇల్లు కట్టే ముందు ఈ విషయంలో జాగ్రత్త!
ఇందిరమ్మ లబ్ధిదారులకు వార్నింగ్.. ఇల్లు కట్టే ముందు ఈ విషయంలో జాగ్రత్త!

Indiramma Housing Scheme : ఇందిరమ్మ లబ్ధిదారులకు వార్నింగ్.. ఇల్లు కట్టే ముందు ఈ విషయంలో జాగ్రత్త!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 03, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, నీట్‌ పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కొలతల్లో తేడా వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు లభించవని హెచ్చరించారు. 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం కొనసాగించాల్సిందిగా లబ్ధిదారులను హెచ్చరించారు. అంతకు మించి నిర్మిస్తే కేవలం రాష్ట్ర నిధులతోనే ఇల్లు నిర్మించుకోవాల్సి వస్తుందని వివరించారు. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోందని, నియోజకవర్గాల్లో ఎంపికలు పర్యవేక్షించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు.

Details

3500 ఇళ్లు కేటాయించాలి

ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారని, అందులో కనీసం 500 పట్టణ ప్రాంతానికి చెందినవారికి అవకాశం కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఎంపికైన వారి జాబితా తక్షణమే సిద్ధం చేయాలని, అర్హులు తప్పకుండా ఎంపికై అనర్హులు తొలగించబడేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని చెప్పారు. భూభారతి చట్టం అమలులో భాగంగా భూముల సమస్యలపై పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది. మే 5 నుంచి 20వ తేదీ వరకు జిల్లాకు చెందిన ఒక్కో మండలంలో ఈ సదస్సులు జరగనున్నాయి. మొదటి విడతగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, అందులో వచ్చిన సమస్యల పరిష్కారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Details

15 లక్షల దరఖాస్తుల వచ్చే అవకాశం

జూన్ 2వ తేదీ వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన దాదాపు 12,759 దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 15 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. దరఖాస్తుదారులకు సహాయంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూముల్లో పాజిషన్ ఉన్న రైతుల దరఖాస్తులను పూర్తిగా పరిశీలించాలని తెలిపారు. అలాగే భూమిలేని అర్హులైన నిరుపేదలకు పట్టాలు కేటాయించేందుకు సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇక నీట్‌ పరీక్ష నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, మే 4వ తేదీన నిర్వహించనున్న పరీక్షను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Details

190 కేంద్రాలు ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 190 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 72,507 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా పరీక్షను నిర్వహించాలని సూచించారు. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి చట్టం, నీట్‌ పరీక్ష నిర్వహణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా ముందుకెళ్తూ, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోంది.