Page Loader
Rajnath Singh: అమాయకుల ప్రాణాలు తీసిన వారినే మేం మట్టుబెట్టాం: రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh: అమాయకుల ప్రాణాలు తీసిన వారినే మేం మట్టుబెట్టాం: రాజ్ నాథ్ సింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతికారంగా, భారత సాయుధ దళాలు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించి హతమార్చాయి. మే 6వ తేదీ రాత్రి నుంచి 7వ తేదీ వరకూ జరిగిన ఈ ప్రతిస్పందనలో, భారత బలగాలు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కేవలం 25నిమిషాల వ్యవధిలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ చర్యల ద్వారా ఉగ్రవాదుల ముఠాలకు వెన్నుముకలా ఉన్న నెట్‌వర్క్‌ను పూర్తిగా చెదిరిపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాదులు చివరకు భారీ మూల్యం చెల్లించారని స్పష్టంగా పేర్కొన్నారు. శత్రువులకు తగిన జవాబును భారత్ ఇచ్చిందని చెప్పారు.

వివరాలు 

హనుమంతుడిని ఆదర్శంగా తీసుకున్నాం

ఈ ప్రతిస్పందన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కొనసాగిందని వివరించారు. భారత సైన్యం తన దైర్యాన్ని, శక్తిని మరోసారి నిరూపించిందని, దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని అన్నారు. పాకిస్థాన్ పౌరుల ప్రాణాలకు ఎలాంటి హానీ కలగకుండా, కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని భారత దళాలు అత్యంత ఖచ్చితంగా ఈ దాడులు నిర్వహించాయని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ పూర్తిగా ప్రణాళికబద్ధంగా, అత్యున్నత స్థాయిలో సాంకేతిక నిపుణతతో నిర్వహించబడిందని వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఆపరేషన్‌లో హనుమంతుడిని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు. సుందర్‌కాండ్‌లోని ఓ శ్లోకాన్ని ఉదహరిస్తూ, ఆత్మవిశ్వాసం, ధైర్యానికి ఇది నిదర్శనమని వివరించారు. ఈ దాడిని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు.

వివరాలు 

భారత్‌కు ఎదుర్కొనే తీరు ఉంది 

అంతేకాకుండా, ఈ ఆపరేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారని చెప్పారు. దీని విజయం దేశ భద్రతా విధానం ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చాటిచెప్పిందని తెలిపారు. దేశ భద్రతకు ఎటువంటి ముప్పు వచ్చినా, దాన్ని పూర్తిగా ఎదుర్కొనే తీరు భారత్‌కు ఉందని, అలాంటి పరిస్థితులను ఏ సందర్భంలోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ సింగ్