LOADING...
West Bengal: నేడే బెంగాల్‌ తుది దశ పోరు.. 142 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం
నేడే బెంగాల్‌ తుది దశ పోరు.. 142 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం

West Bengal: నేడే బెంగాల్‌ తుది దశ పోరు.. 142 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్య ప్రత్యక్ష పోరుగా మారాయి. బుధవారం చివరి దశలో భాగంగా ఏడు జిల్లాల్లోని 142 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ దశలోనే మమతా బెనర్జీతో పాటు విపక్ష నేత సువేందు అధికారి రాజకీయ భవితవ్యం తేలనుంది. దక్షిణ బెంగాల్‌లోని ఈ నియోజకవర్గాలు ఇప్పటివరకు తృణమూల్‌కు బలమైన కోటలుగా ఉన్నాయి. అయితే ఈ సారి కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఉత్తర బెంగాల్‌లో కొంత ప్రభావం చూపిన భారతీయ జనతా పార్టీ, దక్షిణ బెంగాల్‌లో కూడా పట్టు సాధించగలదా అన్న ప్రశ్నకు ఈ ఎన్నికలే సమాధానం చెప్పనున్నాయి.

వివరాలు 

ప్రధాన పోటీ తృణమూల్, భారతీయ జనతా పార్టీ మధ్యే

మొదటి దశలో ఉత్కంఠభరితంగా సాగిన పోరు తర్వాత రెండో దశ రెండు పార్టీలకు మరింత కీలకంగా మారిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ 142 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది. 14 స్థానాల్లో పది వేల ఓట్ల లోపు తేడాతో ఓటమి చెందగా, మరో 50 స్థానాల్లో ఇరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడింది. ఈ సారి ఆ స్థానాలను చేజారనివ్వకూడదనే ఉద్దేశంతో ఆ పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఈ దశలో కాంగ్రెస్, వామపక్షాల ప్రభావం తక్కువగా ఉండగా, ప్రధాన పోటీ తృణమూల్, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

వివరాలు 

తృణమూల్‌దే  పైచేయి అంటున్న సర్వేలు

ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో తృణమూల్ ఆధిపత్యం కొనసాగింది. ఓట్ల శాతం పెరిగినా భారతీయ జనతా పార్టీకి స్థానాల పరంగా పెద్దగా లాభం రాలేదు. అయితే ఈ సారి స్థానాల సంఖ్య పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సర్వేలు తృణమూల్‌కే పైచేయి ఉందని చెబుతున్నప్పటికీ, కొన్ని సర్వేలు మాత్రం భారతీయ జనతా పార్టీ 52స్థానాలు గెలుచుకునే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం కోల్‌కతా,హౌరా,ఉత్తర,దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్వ బర్దమాన్ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2021 ఎన్నికల్లో తృణమూల్ 123 స్థానాల్లో గెలవగా, భారతీయ జనతా పార్టీ కేవలం 18 స్థానాల్లోనే విజయం సాధించింది.

Advertisement

వివరాలు 

భవానీపూర్ నియోజకవర్గంలో  మానసిక పోరాటం

దక్షిణ బెంగాల్‌లో గెలవకుంటే సచివాలయమైన 'నబన్నా'కు మార్గం దొరకదన్న నానుడి ఉండడంతో అందరి దృష్టీ తాజా ఎన్నికలపైనే ఉంది. ఈ ప్రాంతాలు కోల్‌కతా మహానగరం పరిసర ప్రాంతాలు కావడంతో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత పొందాయి. భవానీపూర్ నియోజకవర్గంలో అయితే మానసిక పోరాటం కూడా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాలు, మతాల ప్రజలు నివసించే ఈ ప్రాంతాన్ని చిన్న భారతంగా భావిస్తారు. ఇక్కడ మమతా బెనర్జీ, సువేందు అధికారి నేరుగా తలపడుతున్నారు. 24 పరగణాల జిల్లాల ఫలితాలే నబన్నా దిశను నిర్ణయించనున్నాయి.

Advertisement

వివరాలు 

ఓటర్ల జాబితా సవరణ.. ఓటింగ్‌పై ప్రభావం

దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు ఉన్న ప్రాధాన్యతలా, బెంగాల్‌లో ఈ రెండు జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంది. మతువా, శరణార్థుల ఓట్ల ప్రభావంతో దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఇటీవల బలపడింది. అందుకే ఆ పార్టీ అగ్రనేతలు ఈ ప్రాంతాల్లోనే విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈ జిల్లాల్లో భారీగా పేర్లు తొలగించడం ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉత్తర 24 పరగణాల్లో సుమారు 12.6 లక్షల మంది ఓటర్ల పేర్లు, దక్షిణ 24 పరగణాల్లో 10.9 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి.

Advertisement