LOADING...
Ramchandra Godbole: లక్ష మంది ఆదివాసీలకు ఉచిత చికిత్స.. గోడ్‌బోలే సేవలకు పద్మశ్రీ
లక్ష మంది ఆదివాసీలకు ఉచిత చికిత్స.. గోడ్‌బోలే సేవలకు పద్మశ్రీ

Ramchandra Godbole: లక్ష మంది ఆదివాసీలకు ఉచిత చికిత్స.. గోడ్‌బోలే సేవలకు పద్మశ్రీ

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలకు మూడు దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రామచంద్ర గోడ్‌బోలేకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. మే 25న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. భార్య సునీత గోడ్‌బోలేతో కలిసి ఆయన ఇప్పటివరకు లక్షకు పైగా ఆదివాసీలకు ఉచితంగా వైద్యం అందించారు. ఈ నిస్వార్థ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వైద్య రంగంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించనుంది.

వివరాలు

నక్సల్స్ ప్రాంతాల్లో వైద్య సేవలు..

మహారాష్ట్రలోని సతారా ప్రాంతానికి చెందిన రామచంద్ర గోడ్‌బోలే ఆయుర్వేద వైద్యుడు. 1990లో భార్యతో కలిసి నక్సల్ ప్రభావిత దక్షిణ బస్తర్‌లోని బారసూర్ ప్రాంతానికి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అక్కడ అడవివాసి కళ్యాణ్ ఆశ్రమంలో మూతపడ్డ క్లినిక్‌ను తిరిగి ప్రారంభించి వైద్య సేవలు మొదలుపెట్టారు. ఈ సేవా కార్యక్రమంలో ఆయన భార్య సునీత కూడా కీలక పాత్ర పోషించారు. పిల్లలను పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ విద్యపై అవగాహన కల్పించారు.

వివరాలు

ప్రజలకు ఉచిత చికిత్స..

బస్తర్‌కు వచ్చిన తర్వాత గోడ్‌బోలే దంపతులు ముందుగా ఆదివాసీల భాషను నేర్చుకున్నారు. వారితో సులభంగా మాట్లాడేందుకు, వారి సమస్యలు అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడింది. అనంతరం క్లినిక్‌లో ఉచిత వైద్యం ప్రారంభించారు. రోడ్లు, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ కూడా లేని దూర ప్రాంతాలకు వెళ్లి ఆరోగ్య సేవలు అందించారు. గ్రామాల వారీగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు ఉచిత చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు నిపుణులైన వైద్యులను కూడా ఈ శిబిరాలకు తీసుకెళ్తున్నారు.

Advertisement

వివరాలు

అడవి వాసులకు సేవ చేయాలనే సంకల్పం..

ఆదివాసీల సేవకు ఎలా ప్రేరణ కలిగిందో గోడ్‌బోలే స్వయంగా వెల్లడించారు. 1980లో జర్మనీకి చెందిన డాక్టర్ ఆల్బర్ట్ స్వైట్జర్ రాసిన 'మోర్ ఎవర్ ఫ్రం ద ప్రైమీవల్' అనే పుస్తకం చదివినట్లు చెప్పారు. ఆఫ్రికా ఆదివాసీలకు వైద్య సేవలు అందించేందుకు ఆల్బర్ట్ 31 ఏళ్ల వయసులో చదువు ప్రారంభించి, 38 ఏళ్లకు పూర్తి చేసిన తర్వాత జీవితాంతం సేవ చేశారని తెలిపారు. ఆ పుస్తకం తనలో కూడా అడవివాసులకు సేవ చేయాలనే సంకల్పాన్ని పెంచిందని గోడ్‌బోలే చెప్పారు.

Advertisement

వివరాలు

పద్మశ్రీతో సత్కరించనున్న కేంద్రం..

ఇదిలా ఉండగా, మే 25న రాష్ట్రపతి భవన్‌లో 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. #peoplespadma 'పీపుల్స్ పద్మ' కార్యక్రమంలో భాగంగా ఈసారి కూడా దూర ప్రాంతాల్లో సేవలు చేస్తున్న గుర్తింపు లేని నిజమైన ప్రతిభావంతులకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేశారు. వీరిలో 5 మందికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు.

Advertisement