LOADING...
Adulterated Ghee: నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఎంత?.. సిట్ విచారణ వేగవంతం!
నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఎంత?.. సిట్ విచారణ వేగవంతం!

Adulterated Ghee: నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఎంత?.. సిట్ విచారణ వేగవంతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2025
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

టీటీడీ లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా టెండర్‌ దక్కించుకున్న ఏఆర్‌ డెయిరీ, నెయ్యి ట్యాంకర్లు పంపిన భోలేబాబా డెయిరీ మధ్య రహస్య ఒప్పందం ఎప్పుడు, ఎలా కుదిరిందన్న దానిపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎవరు ఎంతవరకు పాలుపంచుకున్నారన్న కోణంలో విచారణ సాగుతోంది. సిట్ కస్టడీలో ఉన్న ఏఆర్‌ డెయిరీ ఎండీ రాజురాజశేఖరన్, భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్, పొమిల్‌ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడాలను ఆదివారం సిట్ కార్యాలయంలో మూడో రోజూ విచారించారు. 48 గంటల కస్టడీ ముగియడంతో వారికి రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా, రాజురాజశేఖరన్‌కు గుండె సంబంధిత మందులు అవసరమని వైద్యులు సూచించారు.

Details

అపూర్వ చావడా కీలక పాత్రలో?

సిట్, నిందితులను తొలుత వేర్వేరుగా, అనంతరం కలిపి ప్రశ్నించింది. తొలుత అనుసరించిన సమాధానాలపై మరింత స్పష్టత కోరుతూ, తితిదేకు సరఫరా చేసే స్వచ్ఛమైన నెయ్యి సామర్థ్యం లేని ఏఆర్‌ డెయిరీ తక్కువ ధర కోట్‌ చేసి ఎలా టెండర్‌ పొందిందన్న విషయంపై దృష్టిపెట్టింది. 2019లో భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ టెండర్‌ దక్కించుకున్నా,సామర్థ్యం లేదని తితిదే కొనుగోలు కమిటీ తేల్చడంతో టెండర్‌ రద్దు చేశారు. ఆ తర్వాతే విపిన్‌ జైన్, పొమిల్‌ జైన్‌లు శ్రీకాళహస్తి సమీపంలోని వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా మారి, తితిదేకు నెయ్యి సరఫరా చేసేందుకు కుట్ర పన్నారు. కల్తీ నెయ్యి ఏదైనా ఒక డెయిరీలో జరిగినదా, లేక ఏఆర్‌, భోలేబాబా డెయిరీల నుంచే కల్తీ అయ్యి వచ్చిందా అన్నదానిపై విచారణ సాగిస్తోంది.

Details

భోలేబాబా డెయిరీ ఉద్యోగుల పరారీ 

సిట్‌లోని మరో బృందం ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీలో దర్యాప్తు నిర్వహిస్తోంది. డెయిరీతో పాటు, కొందరు ఉద్యోగుల ఇళ్లలో సోదాలు జరిపి ఆధారాలను సేకరించినట్లు సమాచారం. భోలేబాబా డెయిరీలో పనిచేసే 9 మందిని నిందితులుగా గుర్తించగా, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిసింది. వారికోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.