Mumbai: 2040 నాటికి ముంబై నగరం 'కాంక్రీట్ నరకం'గా మారుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలో వేగంగా జరుగుతున్న పునర్నిర్మాణ ప్రాజెక్టులు భవిష్యత్తులో నగర జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్ సమీర్ డి'మాంటే హెచ్చరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న డెవలప్మెంట్ కంట్రోల్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్స్ (DCPR-2034) కారణంగా నగరంలోని నివాస ప్రాంతాలు అధిక జనసాంద్రత, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం,మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. బాంద్రా జిమ్ఖానాలో నిర్వహించిన ఓ ప్రజా సమావేశంలో మాట్లాడిన సమీర్ డి'మాంటే, బాంద్రా వెస్ట్లోని ఒక సాధారణ వీధిని ఉదాహరణగా చూపించారు. 1950లలో ఆ వీధిలో కేవలం 10 ఇళ్లు,సుమారు 50మంది నివాసితులు,నాలుగు కార్లు మాత్రమే ఉండేవని చెప్పారు.
వివరాలు
బాంద్రా వెస్ట్లో ప్రస్తుతం విలాసవంతమైన టవర్ల నిర్మాణం
అయితే 1990ల నాటికి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) పెరగడంతో అదే ప్రాంతంలో 200 అపార్ట్మెంట్లు, 800 మంది నివాసితులు, 150 కార్లు ఉన్నాయని వివరించారు. ఇప్పుడు DCPR-2034 నిబంధనలతో మరింత అధిక FSIకి అనుమతులు లభిస్తున్న నేపథ్యంలో, 2040 నాటికి అదే వీధిలో 300 అపార్ట్మెంట్లు, 1,350 మంది నివాసితులు, 450 కార్లు ఉండే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ముంబైలోని ప్రతి వీధి ఇదే విధంగా మారితే నగర పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించారు. ముంబై శివారు ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతంగా పేరుగాంచిన బాంద్రా వెస్ట్లో ప్రస్తుతం విలాసవంతమైన టవర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది.
వివరాలు
ఇరుకైన వీధుల్లో ట్రాఫిక్ సమస్యలు
ఒకప్పుడు బంగ్లాలు, తక్కువ అంతస్తుల భవనాలతో ఉన్న టర్నర్ రోడ్, పెర్రీ రోడ్, కార్టర్ రోడ్, పాలీ హిల్ వంటి ప్రాంతాల్లో ఇప్పుడు 18 నుంచి 20 అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. ఈ మార్పులను బిల్డర్లు, ఆర్కిటెక్ట్లు, పునర్నిర్మాణ భవనాల్లో పెద్ద ఫ్లాట్లు పొందుతున్న నివాసితులు స్వాగతిస్తున్నప్పటికీ, స్థానికులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇరుకైన వీధుల్లో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని, చెట్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలు తగ్గిపోతున్నాయని, నడిచేందుకు అనుకూలమైన ఫుట్పాత్లు లేవని వారు చెబుతున్నారు. కాలుష్యం, నీటి కొరత, జనసాంద్రత పెరుగుదల కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారే అవకాశముందని పేర్కొంటున్నారు.
వివరాలు
పునర్నిర్మాణాల వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన కారణం
పునర్నిర్మాణాల వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన కారణమని సమీర్ డి'మాంటే అభిప్రాయపడ్డారు. ప్రస్తుత FSI విధానాల కారణంగా ప్రతి భవనం రూ.400 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు విలువ కలిగిన ఆస్తిగా మారుతోందని, అందువల్ల పునర్నిర్మాణ ఆకర్షణను చాలా మంది నిరాకరించలేకపోతున్నారని చెప్పారు. అలాగే, మూడు లేదా నాలుగు అంతస్తుల స్టిల్ట్ పార్కింగ్లతో కూడిన ఎత్తైన టవర్లు ఇరుకైన వీధుల పక్కనే నిర్మించబడుతున్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి నిర్మాణాలు వీధులు, భవనాల మధ్య మానవ సంబంధాన్ని పూర్తిగా తగ్గిస్తాయని, నగరాన్ని కేవలం కాంక్రీట్తో నిండిన ప్రదేశంగా మార్చేస్తాయని హెచ్చరించారు.
వివరాలు
ముంబై ఫుట్పాత్ల పరిస్థితిపై అసంతృప్తి
మానవ అవసరాలకు అనుగుణంగా ఉండే నగర రూపకల్పనకు వీధులు, భవనాలు పరస్పరం అనుసంధానమై ఉండాలని ఆయన చెప్పారు. కానీ ప్రస్తుతం ముంబైలో భవనాల ఎత్తుకు తగ్గట్టుగా వీధుల వెడల్పు లేకపోవడంతో చీకటి, చెత్త, భద్రతా సమస్యలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీంతో ప్రజలు నడవడం కంటే వాహనాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ముంబై ఫుట్పాత్ల పరిస్థితిపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరానికి తగినంత వెడల్పు లేని ఫుట్పాత్లు, పగుళ్లు, అడ్డంకులు కారణంగా అవి వినియోగానికి అనుకూలంగా లేవన్నారు. వియత్నాంలో చిన్న నివాస ప్రాంతాల్లో కూడా 15 అడుగుల వెడల్పు ఫుట్పాత్లు ఉంటాయని, అలాంటి సౌకర్యాలు నగర జీవన అనుభవాన్ని పూర్తిగా మార్చగలవని చెప్పారు.