Maha Kumbhamela: 'ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్': 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న మహా కుంభమేళా యాత్రికులు
ఈ వార్తాకథనం ఏంటి
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లో 300 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దాదాపు 11 గంటలకు పైగా వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన నెటిజన్లు "గూగుల్ నావిగేషన్ను నమ్మవద్దు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కుంభమేళా ప్రారంభమై 28 రోజులు అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 1.42 కోట్లకు పైగా భక్తులు గంగా, సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు.
ఇప్పటి వరకు సుమారు 42 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు హాజరయ్యారు.
ప్రయాగ్రాజ్ వైపు దాదాపు 200-300 కి.మీ మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వివరాలు
200-300 కి.మీ ట్రాఫిక్ జామ్
ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గాల్లో రద్దీ తీవ్రంగా ఉండటంతో భక్తులు గంటల కొద్దీ ట్రాఫిక్లో నిలిచిపోయారు.
మధ్యప్రదేశ్లోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్ స్థంభించింది. కట్ని, మైహార్, రేవా ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనని పత్రికలు నివేదిస్తున్నాయి.
"ఈ రోజు ప్రయాగ్రాజ్కి వెళ్లడం అసాధ్యం.ఎందుకంటే 200-300 కి.మీ ట్రాఫిక్ జామ్ ఉంది" అని పోలీసులు తెలిపారు.
రేవా జిల్లాలోని చక్ఘాట్ వద్ద, కట్ని నుంచి ఎంపీ-యూపీ సరిహద్దుల వరకు దాదాపు 250 కి.మీ మేర ట్రాఫిక్ నిలిచిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీ అధికంగా పెరగడంతో నగర ప్రధాన రైల్వే స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు.
రద్దీ నియంత్రించలేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.