Page Loader
Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు
యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు

Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు.. 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2025
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ, 18 మంది సభ్యులతో వైటీడీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బోర్డు పదవీకాలాన్ని రెండు సంవత్సరాలుగా నిర్ణయించామని, బోర్డు ఛైర్మన్, సభ్యులకు ఎటువంటి జీత భత్యాలు ఉండవన్నారు. వైటీడీ బోర్డు విద్యా సంస్థలను స్థాపించి, నిర్వహించే అధికారాన్ని కలిగి ఉంటుంది. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక,వేద విద్యా సంస్థలను నెలకొల్పే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైటీడీకి అవసరమైన బడ్జెట్ ఆమోదం ప్రభుత్వ ద్వారానే జరుగుతుందని, అలాగే ఈవోగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు.

వివరాలు 

ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలోకి..

గతంలో యాదగిరిగుట్టలో భక్తుల కోసం తగిన వసతులు లేనప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి వాటిని అందుబాటులోకి తెచ్చిందని ఆమె గుర్తుచేశారు. ఇంకా మరింత అభివృద్ధి చేయడానికి పాలక మండలి ఏర్పాటును నిర్ణయించినట్టు తెలిపారు. సమర్థవంతమైన పాలక మండలిని నియమించి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత ప్రగతిపథంలోకి తీసుకువెళ్తామని చెప్పారు. అలాగే, ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలోకి వస్తాయని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.