YS Sharmila: ఏపీలో నియంత పాలన నడుస్తోంది: జగన్ ప్రభుత్వంపై షర్మిల ధ్వజం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కానూరులోని కల్యాణమండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ను చూసి జగన్ ప్రభుత్వం భయపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏపీ బాధ్యతలు తీసుకునేందుకు వస్తున్న సమయంలో తన కాన్వాయ్ను అడ్డుకోవడంపై షర్మిల ధ్వజమెత్తారు. ఏపీలో నియంత పాలన నడుస్తోందని ఆమె మండిపడ్డారు. ఏపీలో ఎక్కడ చూసినా దోచుకోవడం.. దాచుకోవడమే అన్న చందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు.
తెలుగుదేశం, వైసీపీ దొందూ దొందే: షర్మిల
గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు పట్టుమని పది పరిశ్రమలైనా వచ్చాయా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఏపీ నెత్తిన ఇప్పుడు రూ.10లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు అని చెప్పి.. ఒక్కటి కూడా కట్టలేదని కట్టలేకపోయారని విమర్శించారు. తెలుగుదేశం, వైసీపీ దొందూ దొందే అని ఆరోపించారు. రెండు పార్టీలు పోలవరాన్ని తాకట్టుపెట్టారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చిన అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చేందిటన్లు షర్మిల వివరించారు. పాలకులకు ప్రత్యేక హోదా తీసుకురావడం సాధ్యం కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోరాటం అయినా చేశారా? అని ప్రశ్నించారు.