LOADING...
Amarnath yatra 2026: అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం.. జూలై 3 నుంచి యాత్ర
అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం.. జూలై 3 నుంచి యాత్ర

Amarnath yatra 2026: అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం.. జూలై 3 నుంచి యాత్ర

వ్రాసిన వారు Moogati Shabari
Apr 15, 2026
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిమలింగ స్వరూపంలో వెలసిన పరమశివుడిని దర్శించుకోవాలని ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలాంటి పవిత్రమైన అమర్‌నాథ్ యాత్రకు ఈ ఏడాదికి సంబంధించిన తేదీలు నిర్ణయించబడ్డాయి. 2026 సంవత్సరానికి అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు బుధవారం (ఏప్రిల్ 15) నుంచి ప్రారంభించారు. దేశంలోని ఎంపిక చేసిన బ్యాంకు శాఖల ద్వారా ఆఫ్‌లైన్‌లో, అలాగే అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

వివరాలు

57 రోజుల పాటు యాత్ర కొనసాగింపు

ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర మొత్తం 57 రోజుల పాటు జరుగుతుంది. జూలై 3న ప్రారంభమయ్యే ఈ యాత్ర, ఆగస్టు 28న రక్షాబంధన్ (శ్రావణ పౌర్ణమి) రోజున ముగియనుంది. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని హిమాలయ పర్వతాల్లో సుమారు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహను చేరుకునేందుకు అధికారులు రెండు మార్గాలను అందుబాటులో ఉంచారు. నన్వాన్-పహల్గామ్ మార్గం: ఈ మార్గం సాంప్రదాయంగా ఉపయోగించే దారి కాగా దాదాపు 48 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఈ మార్గం కొంత ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, ఎక్కువ మంది భక్తులు ఈ దారినే ఎంచుకుంటారు.

వివరాలు

బ్యాంకుల వద్ద భక్తుల రద్దీ

బాల్తాల్ మార్గం: గాండెర్‌బల్ జిల్లాలో ఉన్న ఈ మార్గం కేవలం 14 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అయితే, ఇది చాలా నిటారుగా ఉండటం వల్ల ప్రయాణం కొంత కష్టతరంగా ఉంటుంది. అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్‌కు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) శాఖల వద్ద భక్తుల రద్దీ గణనీయంగా కనిపిస్తోంది. జమ్మూలోని పీఎన్‌బీ శాఖల వద్ద బుధవారం ఉదయం 8 గంటల నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. "రిజిస్ట్రేషన్ ప్రారంభమైన మొదటి రోజే భారీ స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 556 బ్యాంకు శాఖల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది" అని పీఎన్‌బీ జమ్మూ సర్కిల్ హెడ్ పంకజ్ కుమార్ వర్మ తెలిపారు.

Advertisement

వివరాలు

రిజిస్ట్రేషన్ విధానం, సౌకర్యాలు

ఈసారి దేశవ్యాప్తంగా మొత్తం 556 బ్యాంకు శాఖల్లో నమోదు సౌకర్యం ఏర్పాటు చేశారు. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన 310 శాఖలు, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కు 90 శాఖలు, యెస్ బ్యాంక్‌కు 37 శాఖలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 99 శాఖలు ఉన్నాయి. యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా తమ గుర్తింపు పత్రంతో పాటు, అధికారికంగా గుర్తింపు పొందిన వైద్యుల నుంచి పొందిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. యాత్ర ప్రదేశం అత్యంత ఎత్తులో ఉండటంతో ఆక్సిజన్ కొరత సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్నేళ్లుగా కాశ్మీర్‌లో సౌకర్యాలు మెరుగుపడిన నేపథ్యంలో, ఎలాంటి భయాలు లేకుండా యాత్రకు రావాలని సూచిస్తున్నారు.

Advertisement