వేసవి వేడిని పోగొట్టి చల్లదనాన్ని అందించే పెరుగు ప్రయోజనాలు
వేసవి వేడి చంపేస్తోంది. ఇంట్లో కూర్చున్నా, బయటకు వెళ్ళినా ఎండ వేడి కారణంగా అదోలాంటి అలసట వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో శరీరాని చల్లబర్చుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం పెరుగు చాలా ఉపయోగపడుతుంది. పెరుగు తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్ డి ఉంటాయి. పెరుగులో ఉండే లాక్టికామ్లం కారణంగా చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. ముడుతలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు, చర్మంపై గీతలను, ఎండ కారణంగా చర్మం ఎర్రబడటాన్ని తగ్గిస్తుంది. అయితే పెరుగును ఎలా ఉపయోగిస్తే శరీరానికి సరైన ఆరోగ్యం అందుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
చర్మ సంరక్షణలో పెరుగు చేసే ప్రయోజనాలు
మాయిశ్చరైజర్ గా పనిచేసే పెరుగు: ఎండాకాలంలో చర్మం పొడిబారుతుంటుంది. ఇలాంటప్పుడు పెరుగును మీ ముఖానికి మర్దన చేసుకోవాలి. కొంచెం తేనె, కొంచెం పెరుగును కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి మర్దన చేసుకోవాలి. 15నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడుక్కుంటే మీ చర్మం తేమగా ఉంటుంది. ఇంకా మృదువుగా మారుతుంది. ఎండవల్ల ఏర్పడే మంటను తగ్గిస్తుంది: ఎండవల్ల చర్మం మీద మంటలు కలుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో చర్మం ఎర్రగా మారి మండుతుంటుంది. ఇలాంటప్పుడు పెరుగును, చర్మం ఎర్రగా మారిన ప్రాంతాల్లో పెట్టుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. దద్దుర్లు, బొబ్బలు కూడా పెరుగు వల్ల తగ్గిపోతాయి. మొటిమలు, కళ్ళకింద నల్లటి వలయాలు పోవాలంటే పెరుగును ఆయా ప్రాంతాల్లో మర్దన చేయండి.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి