అంతర్జాతీయ అహింసా దినోత్సవం 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు
అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ప్రతీ ఏడాది అక్టోబర్ 2వ తేదీన జరుపుకుంటారు. భారత స్వాతంత్ర్య సమరయోద్యుడైన మహాత్మాగాంధీ పుట్టినరోజు సందర్భంగా అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అహింసతో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గాంధీజీ ఆదర్శాలను ఈనాటి యువతరానికి తెలియజేసేందుకు అహింసా దినోత్సవాన్ని జరుపుతున్నారు. హింస లేకుండా వివాదాలను పరిష్కారం జరిగేలా యువతను ప్రోత్సహించేందుకు, ఆ దిశగా జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. రీసెంట్ అధ్యయనం ప్రకారం, హింస కన్నా అహింస ఎక్కువ ప్రభావంగా ఉంటుందని, దాని వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని తేలింది. అందుకే సమాజానికి సంబంధించిన విషయాల్లో అహింస గొప్పదని అంటున్నారు.
అహింసా దినోత్సవం చరిత్ర
అహింసా దినోత్సవం జరుపుకోవాలని మొదటిసారిగా ఇరాన్ కి చెందిన నోబెల్ గ్రహీత షిరీన్ ఎబాడీ, 2004లో ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదననను కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకు తీసుకెళ్ళారు. మహాత్మ గాంధీ ఆదర్శాలను, ఆయన జీవిత విశేషాలను నేటి యువతరానికి తెలియజేసే విధంగా అహింసా దినోత్సవం జరపాలని అనుకున్నారు. ఆ తర్వాత 2007లో ఐక్యరాజ సమితి సాధారణ సమావేశం అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని యాక్సెప్ట్ చేసింది. ప్రతీ ఏడాది గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన అహింసా దినోత్సవం జరపాలని సూచించింది. అహింసా దినోత్సవం రోజున ప్రత్యేక థీమ్ అంటూ ఏదీ లేదు. అహింస అనేదే థీమ్ గా ఉంటుంది.