Shigella infection: కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్ కలకలం.. 4 ఏళ్ల చిన్నారి మృతి,మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ..
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో షిగెల్లా (Shigella) ఇన్ఫెక్షన్ ఆందోళన కలిగిస్తోంది. కోజికోడ్లో నాలుగేళ్ల చిన్నారి ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందగా, మరో ఇద్దరికి షిగెల్లా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో మొత్తం 21 నమూనాలను పరీక్షలకు పంపగా, అందులో రెండు పాజిటివ్గా తేలాయి. మిగిలిన 19 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఘటనతో షిగెల్లా ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? అది ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలు ఏమిటి? దాని నుంచి ఎలా రక్షించుకోవాలి? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశాలపై ఏషియన్ హాస్పిటల్కు చెందిన చిన్నపిల్లలు, కౌమార ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ మేఘనా ఫడ్కే సుల్తానియా వివరాలు వెల్లడించారు.
వివరాలు
ఒకటి నుంచి ఏడు రోజులలో లక్షణాలు
వైద్యుల ప్రకారం,షిగెల్లా బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది పేగులు,పొత్తికడుపు లోపలి పొరల్లో వాపును కలిగిస్తుంది. కలుషితమైన నీరు,అపరిశుభ్రమైన ఆహారం,ముఖ్యంగా పాల ఉత్పత్తులు, అలాగే సోకిన వ్యక్తుల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని వైద్య పరిభాషలో షిగెల్లోసిస్ (Shigellosis) అని పిలుస్తారు. షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత సాధారణంగా ఒకటి నుంచి ఏడు రోజులలో లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, వికారం, ఆకలి తగ్గిపోవడం ప్రధాన లక్షణాలు. కొంతమందిలో రక్తం లేదా జిగురు కలిసిన మలం రావడం కూడా కనిపిస్తుంది. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్కు సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్ర పరిస్థితుల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
వివరాలు
శరీరంలో నీటి కొరత రాకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యం
చికిత్స విషయానికి వస్తే, శరీరంలో నీటి కొరత రాకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు. తగినంత నీరు, ఓఆర్ఎస్ (ORS) ద్రావణాలు తీసుకోవాలి. స్వల్ప లక్షణాలు ఉంటే సాధారణ చికిత్సతో కోలుకునే అవకాశం ఉంది. అయితే తీవ్రంగా ఇన్ఫెక్షన్ సోకినవారికి లేదా వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వైద్యులు యాంటీబయాటిక్స్ ఇవ్వవచ్చు. డాక్టర్ సలహా లేకుండా విరేచనాల మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, పారిశుద్ధ్య సౌకర్యాలు సరిగా లేని ప్రాంతాల్లో నివసించే ప్రజలు షిగెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వివరాలు
పరిశుభ్రత పాటించడం అత్యంత ముఖ్యం
షిగెల్లా నుంచి రక్షణ పొందాలంటే పరిశుభ్రత పాటించడం అత్యంత ముఖ్యం. మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత, భోజనం చేసే ముందు, ఆహారం తయారు చేసే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సురక్షితమైన తాగునీరు మాత్రమే వినియోగించాలి. అపరిశుభ్రమైన ప్రాంతాల్లో తయారైన ఆహారాన్ని తినకుండా ఉండాలి. విరేచనాలతో బాధపడుతున్న వారు ఇతరులకు ఆహారం తయారు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. తరచూ తాకే వస్తువులు, ఉపరితలాలను శుభ్రంగా ఉంచడం కూడా అవసరం.
వివరాలు
షిగెల్లా ఇన్ఫెక్షన్పై తరచుగా అడిగే ప్రశ్నలు
షిగెల్లా ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? ఇది పేగులపై దాడి చేసే అత్యంత అంటువ్యాధి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ప్రధాన లక్షణం ఏమిటి? తీవ్రమైన రక్త విరేచనాలు. వీటితో పాటు కడుపునొప్పి,జ్వరం,మలం వెళ్లాలనే భావన ఎక్కువగా ఉండటం కనిపిస్తాయి. ఇది ఎలా వ్యాపిస్తుంది? సోకిన వ్యక్తి మలం ద్వారా బ్యాక్టీరియా కలుషితమైన ఆహారం,నీరు లేదా చేతుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. వ్యాధి ఎంతకాలం ఉంటుంది? సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి నుంచి రెండు రోజుల్లో లక్షణాలు మొదలై, ఐదు నుంచి ఏడు రోజుల్లో తగ్గిపోతాయి. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? మలంలో రక్తం కనిపించినా,అధిక జ్వరం వచ్చినా,తీవ్రమైన దాహం,నోరు ఎండిపోవడం,మూత్రం ముదురు రంగులో రావడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.