Page Loader
Cyber crimes: ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!
ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!

Cyber crimes: ప్రతిసెకనుకు 11 దాడులు.. డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న ముప్పు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 11, 2024
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా రూపొందిస్తున్న మాల్‌వేర్‌ల కారణంగా రాబోయే కాలంలో సైబర్‌ ముప్పులు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ), సెక్‌రైట్‌ సంస్థలు తాజాగా విడుదల చేసిన 'ఇండియా సైబర్‌ థ్రెట్‌ రిపోర్ట్‌-2025' వెల్లడించింది. ఏఐనే ఉపయోగించి ఈ ముప్పులను నియంత్రించే మార్గాలూ ఉన్నాయని ఈ నివేదిక సూచిస్తుంది. గతేడాది కాలంలో ప్రతి సెకనుకు 11 సైబర్‌ దాడులు చోటుచేసుకున్నట్లు నివేదికలో తేలింది. దేశవ్యాప్తంగా 84 లక్షల ఎండ్‌పాయింట్లలో గుర్తించిన దాడుల్లో 36.9 కోట్ల మాల్‌వేర్‌లు వినియోగించారు. అంటే సగటున నిమిషానికి 702 దాడులు జరిగినట్లు ఈ నివేదిక చెబుతోంది.

Details

సైబర్ దాడుల్లో తెలంగాణ మొదటి స్థానం

ఈ దాడులు ప్రధానంగా హెల్త్‌కేర్‌ (21.82%), ఆతిథ్యం (19.57%), బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (17.38%), ఎడ్యుకేషన్‌ (15.64%), MSME (7.52%), మాన్యుఫ్యాక్చరింగ్‌ (6.88%) రంగాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ర్యాన్సమ్‌వేర్‌ గ్రూపులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను లక్ష్యంగా చేసుకుంటూ డేటాను బ్లాక్‌ చేసి, తిరిగి అప్పగించాలంటే భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యమైన 10 ర్యాన్సమ్‌వేర్‌ గ్రూపులలో రైసిడా, ర్యాన్సమ్‌హబ్‌, లాక్‌బిట్‌ 3.0 వంటి గ్రూపులు ముందున్నాయి. దేశంలో జరిగిన సైబర్‌ దాడుల గుర్తింపులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రం 15.03% మాల్‌వేర్లను గుర్తించడం ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది.

Details

5జీ నెట్‌వర్క్‌ కారణంగా సైబర్ నేరాలు పెరిగే అవకాశం

హైదరాబాద్‌లో ఉన్న బలమైన ఐటీ, సైబర్‌ భద్రతా ఫ్రేమ్‌వర్క్‌లు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌, వన్‌డ్రైవ్‌ వంటి క్లౌడ్‌ ఫైల్‌ షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు సైబర్‌ నేరగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు డేటా షేరింగ్‌ సౌలభ్యం అందించడంతోపాటు సైబర్‌ దాడులకు అవకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో డీప్‌ఫేక్‌లు, డేటా చౌర్యం, మాల్‌వేర్‌లు, ర్యాన్సమ్‌వేర్‌ నేరాలకు అవకాశాలు పెరుగుతాయని నివేదిక హెచ్చరిస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ విస్తరణతో సైబర్‌ ముప్పులు మరింత పెరుగుతాయని అంచనా.

Details

సైబర్‌ భద్రతకు సైబర్‌ హైజీన్ కీలకం

సైబర్‌ భద్రతకు సైబర్‌ హైజీన్ కీలకమని నివేదిక స్పష్టం చేసింది. ఇందులో డేటా ప్రొటెక్షన్‌, మాల్‌వేర్‌ నివారణ, డేటా బ్యాకప్‌, మరియు ప్రైవసీ కంట్రోల్‌ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ముఖ్యంగా, ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసి, సైబర్‌ నేరాలను సమర్థంగా ఎదుర్కోవాలని నివేదిక సిఫార్సు చేసింది.