Social Media: సోషల్ మీడియా వినియోగంపై వయస్సు పరిమితులు?.. కేంద్రం కీలక ఆలోచన!
ఈ వార్తాకథనం ఏంటి
సామాజిక మాధ్యమాల వినియోగంపై వయస్సు ఆధారిత పరిమితులు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వివిధ టెక్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో చర్చలు జరుపుతోంది. సోషల్ మీడియా దుష్ప్రభావాల కారణంగా ఇప్పటికే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నిషేధాలు అమలు చేస్తున్నాయి. అదే దిశగా భారత్ కూడా అడుగులు వేస్తోందని సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ధ్రువీకరించారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, "ప్రస్తుతం మేము డీప్ఫేక్లు, వయస్సు ఆధారిత నియంత్రణలపై వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో చర్చలు జరుపుతున్నాం. అనేక దేశాలు ఇప్పటికే వయస్సు ఆధారిత నియంత్రణలను అమలు చేస్తున్నాయి.
Details
భారతదేశంలో కూడా అవసరం
భారతదేశంలో కూడా ఇది అవసరమని భావిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే కూడా డిజిటల్ ఎడిక్షన్ను తగ్గించేందుకు వయస్సు ఆధారిత సోషల్ మీడియా ప్రాప్యత వ్యవస్థ అవసరమని సూచించింది. పలువురు ఎంపీలు కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ చూపుతోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన సంప్రదింపుల దశలో కొనసాగుతోంది.