Pompeii: తుపాకుల కాలానికి ముందే పాంపీలో అద్భుత ఆయుధం.. వెలుగులోకి 2000 ఏళ్ల నాటి యుద్ధ రహస్యం
ఈ వార్తాకథనం ఏంటి
పాంపీ నగరం అంటే క్రీ.శ. 79లో వెసువియస్ అగ్నిపర్వతం పేలిపోవడంతో బూడిదలో మునిగిపోయిన దృశ్యం మనసుకు వెంటనే గుర్తుకొస్తుంది. అయితే, ఆ విపత్తుకంటే దాదాపు 170 సంవత్సరాల ముందే అక్కడ ఒక తీవ్రమైన యుద్ధం జరిగినట్లు తాజా పరిశోధనలు వెల్లడించాయి. ఆ యుద్ధంలో అత్యంత శక్తివంతమైన, వేగంగా బాణాలు సంధించే ఒక ప్రత్యేక ఆయుధాన్ని ఉపయోగించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఇటలీకి చెందిన కాంపానియా,బోలోగ్నా విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఆధునిక లేజర్ పరిశీలన విధానం, మూడు కోణాల డిజిటల్ చిత్రీకరణ సాంకేతికతల సహాయంతో ఈ విషయాన్ని గుర్తించారు. పాంపీ నగర ఉత్తర భాగంలో ఉన్న కోట గోడలపై బాణాల దాడికి సంబంధించిన ప్రత్యేక గుర్తులను వారు గమనించారు.
వివరాలు
ఒకేసారి అనేక బాణాలను వేగంగా సంధించగల 'పాలిబోలోస్'
ఈ గుర్తులు సాధారణ యంత్రాల దాడిలా పెద్దవిగా కాకుండా చిన్న చిన్న గుంపులుగా కనిపించాయి. ఒకే ప్రదేశం నుంచి వేగంగా వరుసగా బాణాలు సంధించడం వల్లే ఇలాంటి గుర్తులు ఏర్పడతాయని వారు నిర్ధారించారు. ఈ సంఘటన క్రీ.పూ. 89లో రోమన్ సేనాధిపతి లూసియస్ కార్నెలియస్ సూలా పాంపీ నగరాన్ని ముట్టడించిన సమయంలో జరిగిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. తూర్పు మధ్యధరా ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల సమయంలో ఆయన ఈ ఆధునిక ఆయుధ సాంకేతికతను సంపాదించి ఉండవచ్చని భావిస్తున్నారు. 'పాలిబోలోస్' అనే ఈ ఆయుధం ఒకేసారి అనేక బాణాలను వేగంగా సంధించగల ప్రత్యేక సామర్థ్యంతో ఉండేది. ఇది గురుత్వాకర్షణ ఆధారంగా పనిచేసే నిల్వ వ్యవస్థ ద్వారా బాణాలను స్వయంచాలకంగా నింపుకుని నిరంతరంగా దాడి చేయగలిగేది.
వివరాలు
ఆయుధం నిజంగానే ఉపయోగంలో ఉన్నట్లు నిరూపించిన పరిశోధన
ఈ ఆయుధానికి సంబంధించిన ప్రత్యక్ష అవశేషాలు ఇప్పటివరకు లభించలేదు. అయినప్పటికీ, కోట గోడలపై కనిపించిన ఈ ప్రత్యేక దాడి గుర్తులే దీనిని ఉపయోగించినట్లు స్పష్టమైన ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఇప్పటివరకు పుస్తకాలలో మాత్రమే ప్రస్తావన ఉన్న ఈ ఆయుధం నిజంగానే ఉపయోగంలో ఉన్నట్లు ఈ పరిశోధన ద్వారా నిరూపితమైంది. ఈ విశేషాలను ఎండీపీఐ జర్నల్లో ప్రచురించారు.