LOADING...
Anthropic: ఫేబుల్-5తో ఏఐలో కొత్త సంచలనం.. శక్తివంతమైన మోడల్‌ను విడుదల చేసిన ఆంత్రోపిక్
ఫేబుల్-5తో ఏఐలో కొత్త సంచలనం.. శక్తివంతమైన మోడల్‌ను విడుదల చేసిన ఆంత్రోపిక్

Anthropic: ఫేబుల్-5తో ఏఐలో కొత్త సంచలనం.. శక్తివంతమైన మోడల్‌ను విడుదల చేసిన ఆంత్రోపిక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2026
08:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ మరో కీలక అడుగు వేసింది. తమ అత్యంత శక్తివంతమైన 'మైథోస్' సిరీస్‌లో తొలి పబ్లిక్ ఏఐ మోడల్‌గా 'ఫేబుల్-5'ను జూన్ 10న అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు కంపెనీ విడుదల చేసిన మోడళ్లలో ఇదే అత్యంత సామర్థ్యవంతమైనదిగా చెబుతున్నారు. ఫేబుల్-5 ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కోడింగ్, కోడ్‌లోని లోపాలను గుర్తించి సరిచేయడం, క్లిష్టమైన పరిశోధనలకు సమగ్ర సమాధానాలు ఇవ్వడం, చిత్రాలను విశ్లేషించడం వంటి పనుల్లో మెరుగైన పనితీరును కనబరుస్తుందని ఆంత్రోపిక్ వెల్లడించింది. అధునాతన ఏఐ అవసరాల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొంది.Embed

వివరాలు 

1,000 గంటలకు పైగా రెడ్-టీమింగ్ పరీక్షలు

అయితే, ఈ మోడల్ వినియోగంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన కంపెనీ కఠిన నియంత్రణలు అమలు చేసింది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్‌లు, కీలక సాఫ్ట్‌వేర్ మౌలిక వసతుల్లోని లోపాలను గుర్తించే ప్రశ్నలు ఎదురైతే, వాటిని తక్కువ సామర్థ్యం కలిగిన 'ఓపస్ 4.8' మోడల్‌కు మళ్లించే విధంగా వ్యవస్థను రూపొందించింది. ఫేబుల్-5 విడుదలకు ముందు 1,000 గంటలకు పైగా రెడ్-టీమింగ్ పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. అయినప్పటికీ, పూర్తిస్థాయిలో భద్రతా రక్షణ వ్యవస్థను అధిగమించడం సాధ్యం కాలేదని వెల్లడించింది. దీంతో ప్రజలకు అందించే వెర్షన్‌పై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది.

వివరాలు 

సున్నితమైన అంశాలపై పరిమితులు, ఓపస్ 4.8 కన్నా రెట్టింపు ధర

ఇక 'క్లాడ్ మైథోస్ 5' పేరుతో పూర్తి అన్‌రెస్ట్రిక్టెడ్ వెర్షన్‌ను 'ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్' కింద కేవలం 200 ప్రభుత్వ, కార్పొరేట్ భాగస్వాములకు మాత్రమే అందుబాటులో ఉంచుతోంది. గతంలో అమెరికా ప్రభుత్వంతో ఏర్పడిన వివాదాల నేపథ్యంలోనే ఈ భద్రతా విధానాలను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ధరల విషయానికి వస్తే, ఓపస్ 4.8తో పోలిస్తే ఫేబుల్-5కు దాదాపు రెట్టింపు ధర నిర్ణయించారు. ప్రతి 10 లక్షల ఇన్‌పుట్ టోకెన్లకు 10 డాలర్లు, అవుట్‌పుట్ టోకెన్లకు 50 డాలర్ల చొప్పున వసూలు చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఐపీఓకు సిద్ధమవుతోంది. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, అత్యాధునిక ఏఐ సాంకేతికతను దశలవారీగా ప్రజలకు చేరవేయాలన్న ఆంథ్రోపిక్ వ్యూహంలో ఫేబుల్-5 కీలక మైలురాయిగా నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కంపెనీ చేసిన ట్వీట్ 

Advertisement