Loading...
Dogs: కుక్కలు క్యాన్సర్‌ను గుర్తించగలవా? బెంగళూరు స్టార్టప్‌ 10 వేల మందిపై కీలక పరీక్షలు
కుక్కలు క్యాన్సర్‌ను గుర్తించగలవా? బెంగళూరు స్టార్టప్‌ 10 వేల మందిపై కీలక పరీక్షలు

Dogs: కుక్కలు క్యాన్సర్‌ను గుర్తించగలవా? బెంగళూరు స్టార్టప్‌ 10 వేల మందిపై కీలక పరీక్షలు

వ్రాసిన వారు Moogati Shabari
Aug 14, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

క్యాన్సర్‌ను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలను ఉపయోగిస్తూ బెంగళూరుకు చెందిన డాగ్నోసిస్ (Dognosis) అనే స్టార్టప్‌ వినూత్న పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 10 ఆసుపత్రుల్లో 10 వేల మందిపై భారీ స్థాయి అధ్యయనాన్ని ప్రారంభించింది. కుక్కలతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికతను ఉపయోగించి శ్వాస ద్వారా క్యాన్సర్‌ను గుర్తించే విధానాన్ని ఈ సంస్థ పరీక్షిస్తోంది. భారత్‌లో తక్కువ ఖర్చుతో, శరీరంలో ఎలాంటి కోతలు లేకుండా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే స్క్రీనింగ్‌ విధానాన్ని 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని డాగ్నోసిస్‌ చెబుతోంది.

వివరాలు

ప్రక్రియ ఎలా జరుగుతుంది?

సాధారణంగా డ్రగ్స్‌, పేలుడు పదార్థాలను గుర్తించేందుకు ఉపయోగించే కుక్కల ఘ్రాణశక్తిని ఆరోగ్య పరీక్షలకు వినియోగించడం ఈ విధానంలో ప్రత్యేకత.

ముఖ్యంగా క్యాన్సర్‌ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంపై సంస్థ దృష్టి సారించింది.

డాగ్నోసిస్‌కు చెందిన శిక్షణ పొందిన కుక్కలు మనుషుల శ్వాస నమూనాల్లో క్యాన్సర్‌కు సంబంధించిన ప్రారంభ సంకేతాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.

ఇందుకోసం రోగులు ప్రత్యేక మాస్కుల్లోకి శ్వాస తీసుకుంటారు.

అనంతరం ఆ మాస్కులను సంస్థకు చెందిన పరీక్షా కేంద్రానికి పంపిస్తారు.

వివరాలు

ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ గుర్తింపు

అక్కడ శిక్షణ పొందిన కుక్కలకు ఈ శ్వాస నమూనాలను వాసన చూసేలా చేస్తారు.

కుక్కల కదలికలు, శ్వాస, మెదడు కార్యకలాపాలు, శరీర భాష వంటి సంకేతాలను సెన్సర్లు, AI సాంకేతికత ద్వారా విశ్లేషిస్తారు.

ఈ డేటా ఆధారంగా ఆ శ్వాస నమూనాలో క్యాన్సర్‌కు సంబంధించిన సంకేతాలు ఉన్నాయా లేదా అన్నది గుర్తించే ప్రయత్నం చేస్తారు.

ఈ విధానంలో ఇమేజింగ్‌ స్కాన్లు లేదా రక్త పరీక్షలు అవసరం ఉండవు.

'జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీ'లో ప్రచురితమైన రెండో దశ అధ్యయనంలో.. ఏడు విస్తృత క్యాన్సర్‌ విభాగాలకు చెందిన 20కి పైగా రకాల క్యాన్సర్లను గుర్తించడంలో డాగ్నోసిస్‌ కుక్కలు దాదాపు 90 శాతం సెన్సిటివిటీని చూపించినట్లు సంస్థ తెలిపింది. ఇందులో రొమ్ము క్యాన్సర్‌ కూడా ఉంది.

ADVERTISEMENT

వివరాలు

వచ్చే ఏడాది ఇంటి నుంచే పరీక్ష..

వచ్చే ఏడాది భారత్‌లో ఇంటి నుంచే చేసుకునే మల్టీ-క్యాన్సర్‌ ప్రీ-స్క్రీనింగ్‌ పరీక్షను అందుబాటులోకి తీసుకురావాలని డాగ్నోసిస్‌ భావిస్తోంది.

ఈ పరీక్షకు కొన్ని వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

ఏడాదికి 10 లక్షల పరీక్షలను నిర్వహించే స్థాయికి చేరుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకోసం తమ వద్ద ఉన్న శిక్షణ పొందిన కుక్కల సంఖ్యను 30కి రెట్టింపు చేయడంతో పాటు.. పరీక్షల ఫలితాలు వచ్చే సమయాన్ని ఒక వారానికి తగ్గించాలని యోచిస్తోంది.

అయితే పెద్ద సంఖ్యలో ప్రజలపై పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా ఇదే స్థాయిలో ఖచ్చితత్వం కొనసాగుతుందా అన్నది నిరూపించాల్సి ఉంది.

శ్వాస నమూనాలను తరలించడం, ప్రాసెస్‌ చేయడం కోసం అవసరమైన లాజిస్టిక్స్‌ను కూడా సంస్థ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

ADVERTISEMENT