Taiwan: తైవాన్పై చైనా హ్యాకర్ల సైబర్ దాడి.. AIతో గంటలోనే 85 ప్రభుత్వ ఖాతాలు హ్యాక్
ఈ వార్తాకథనం ఏంటి
చైనా హ్యాకర్ల బృందం ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లను ఉపయోగించి తైవాన్ ప్రభుత్వంపై దాదాపు స్వయంచాలకంగా సైబర్ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడి అత్యంత ప్రభావవంతంగా సాగినట్లు ఇజ్రాయెల్కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ డ్రీమ్ తెలిపింది. కేవలం గంటలోనే పాస్వర్డ్లను ఊహించడం ద్వారా ప్రభుత్వానికి చెందిన 85 ఖాతాలను హ్యాకర్లు ఛేదించారు. అంతేకాకుండా వేలాది రికార్డులను దొంగిలించడంతో పాటు ప్రభుత్వ వెబ్ అప్లికేషన్లోని భద్రతా లోపాలను గుర్తించారు. ఓపెన్ సోర్స్ AI ఏజెంట్లైన హెర్మిస్, ఓపెన్క్లా (OpenClaw)లను ఉపయోగించే సాఫ్ట్వేర్ ఫ్రేమ్వర్క్ను హ్యాకర్లు స్వయంగా అభివృద్ధి చేసినట్లు డ్రీమ్ వెల్లడించింది.
వివరాలు
సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఏం చేస్తారంటే..
ఈ AI ఏజెంట్లు కంప్యూటర్లో స్వయంచాలకంగా పనిచేయగలవు. ఈ ఫ్రేమ్వర్క్లో కనీసం ఎనిమిది 'సబ్-ఏజెంట్లు' ఉన్నట్లు గుర్తించారు.
వీటిలో ఒక్కో ఏజెంట్కు ఒక్కో పని అప్పగించారు. భద్రతా లోపాలను పరీక్షించడం, పాస్వర్డ్లను ఊహించడం, సప్లై చైన్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం వంటి పనులను అవి నిర్వహించాయి.
ఈ AI ఏజెంట్లు తమకు ఉన్న భద్రతా నియంత్రణలను కూడా దాటవేసినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇందుకోసం తమకు ఇచ్చిన ఆదేశాలను 'అనుమతితో నిర్వహిస్తున్న పెనిట్రేషన్ టెస్టింగ్'గా పేర్కొన్నట్లు తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ నిపుణులు సాధారణంగా వ్యవస్థల్లోని భద్రతా లోపాలను గుర్తించేందుకు ఇలాంటి పెనిట్రేషన్ టెస్టింగ్ నిర్వహిస్తారు.
వివరాలు
యూజర్ డేటాబేస్ను దొంగిలించినట్లు గుర్తింపు..
ఆసియాలోని ప్రభుత్వ సంస్థలపై, ముఖ్యంగా తైవాన్పై స్వయంచాలక AI దాడుల ఫ్రేమ్వర్క్తో చొరబాటు కార్యకలాపాలు జరుగుతున్నట్లు గత నెలలో గుర్తించినప్పుడు ఈ ముప్పు వెలుగులోకి వచ్చిందని డ్రీమ్ పరిశోధకులు తెలిపారు.
వ్యవస్థలను హ్యాక్ చేసేందుకు ఉపయోగించిన కంప్యూటర్ కోడ్ను పరిశీలించగా.. అంతర్గత స్టేటస్ రిపోర్టుల్లో సింప్లిఫైడ్ చైనీస్ భాషను ఉపయోగించినట్లు గుర్తించారు.
అయితే లక్ష్య సంస్థలకు సంబంధించిన విశ్లేషణలో మాత్రం ట్రెడిషనల్ చైనీస్ కనిపించింది.
తైవాన్లో ప్రధానంగా ట్రెడిషనల్ చైనీస్నే ఉపయోగిస్తుండటంతో.. ఆ దేశమే ఈ దాడికి ప్రధాన లక్ష్యమని ఇది బలంగా సూచిస్తోందని పరిశోధకులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా హ్యాకర్లు 2,564కు పైగా సిబ్బంది రికార్డులతో పాటు పూర్తి యూజర్ డేటాబేస్ను దొంగిలించినట్లు గుర్తించారు.
వివరాలు
ఈమెయిల్ వ్యవస్థల పరిశీలన..
ప్రారంభ లక్ష్యాలకే పరిమితం కాకుండా హ్యాకర్లు తమ దాడులను మరింత విస్తరించారు.
ప్రభుత్వ ఐటీ సప్లై చైన్కు చెందిన సంస్థలు, అణు భద్రతా సంస్థ, ప్రభుత్వ ఈమెయిల్ వ్యవస్థలను కూడా పరిశీలించారు.
ఇంధన రంగానికి చెందిన ఏడు కంటే ఎక్కువ కంపెనీలను సైతం లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ వ్యవస్థలను ఒకేసారి స్కాన్ చేసి.. తప్పుగా ఉన్న కాన్ఫిగరేషన్లు, బహిరంగంగా అందుబాటులో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్ఫేస్లు, దాడికి ఉపయోగించగల భద్రతా లోపాలను గుర్తించే ప్రయత్నం చేశారు.
హానికరమైన సైబర్ కార్యకలాపాలకు స్వయంచాలకంగా పనిచేసే AI వ్యవస్థలను ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులు ఎంత తీవ్రంగా ఉండవచ్చో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు.