ISRO: 'సీఎంఎస్-03' ప్రయోగం విజయవంతం.. శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరిన ఎల్వీఎం3-ఎం5
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి 'ఎల్వీఎం3-ఎం5' వాహక నౌకను ప్రయోగించారు. ఇందులో 'సీఎంఎస్-03' ఉపగ్రహం అమర్చారు. 4,410 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి ప్రవేశపెట్టనున్నారు. భారత భూభాగం నుంచి ఇప్పటివరకు జీటీవో కక్ష్యలోకి పంపిన ఉపగ్రహాల్లో ఇది అత్యంత బరువైనదిగా గుర్తింపు పొందింది. సీఎంఎస్-03 ఉపగ్రహం ద్వారా దేశంలోని సమాచార వ్యవస్థలు మరింత మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడానికి ఉపయోగపడనుంది.
Details
కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ ఉపగ్రహం ద్వారా నిర్వహించవచ్చు
ముఖ్యంగా భారత నౌకాదళం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ శాటిలైట్ను అభివృద్ధి చేశారు. సముద్ర జలాల్లో ఉన్న యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాల మధ్య భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ ఉపగ్రహం ద్వారా నిర్వహించవచ్చు. 'జీశాట్-7ఆర్' (GSAT-7R) అని కూడా పిలువబడే ఈ ఉపగ్రహం, 2013 నుంచి సేవలందిస్తున్న 'జీశాట్-7' స్థానాన్ని భర్తీ చేస్తుంది. కొత్త శాటిలైట్ ప్రవేశంతో నౌకాదళ కమ్యూనికేషన్ సామర్థ్యం మరింత పెరగనుంది.