SIM-binding: సిమ్ బైండింగ్ గడువును ప్రభుత్వం పొడిగించే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్లకు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనల గడువును మరోసారి పొడిగించడానికి సిద్ధమైంది. టెలికమ్యూనికేషన్ల శాఖ(DoT) అధికారులు వెల్లడించిన ప్రకారం,వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్లకు గడువు ఇప్పుడు డిసెంబర్ చివరి వరకు పెంచే అవకాశం ఉంది. టెక్ కంపెనీలు అమలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వివరాలు
SIM బైండింగ్ అంటే ఏమిటి?
గత ఏడాది నవంబర్లో DoT SIM బైండింగ్ నిబంధనలను ప్రవేశపెట్టింది. మొబైల్ నంబర్లపై ఆధారపడి పనిచేసే యాప్లు యూజర్ డివైస్లో ఉన్న యాక్టివ్ SIM కార్డ్తో తప్పనిసరిగా లింక్ కావాలని ఇందులో పేర్కొన్నారు. ఈ నియమాల ప్రధాన ఉద్దేశ్యం సైబర్ నేరాలను అరికట్టడమే. SIM తీసివేసినా, డియాక్టివేట్ చేసినా లేదా విదేశాలకు వెళ్లినా కూడా యాప్ అకౌంట్లు పనిచేస్తుండటం వల్ల మోసగాళ్లు పెద్ద ఎత్తున డిజిటల్ మోసాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నకిలీ కాల్స్, "డిజిటల్ అరెస్ట్" మోసాలు, ప్రభుత్వ అధికారుల పేరుతో మోసాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
వివరాలు
వెబ్ & డెస్క్టాప్ వర్షన్లపై కఠిన నిబంధనలు
SIM బైండింగ్ నిబంధనల ప్రకారం, ఈ యాప్ల వెబ్, డెస్క్టాప్ వర్షన్లపై కూడా పరిమితులు విధించారు. ప్రతి ఆరు గంటలకు ఒకసారి యూజర్ను ఆటోమేటిక్గా లాగ్ అవుట్ చేసి, QR కోడ్ ద్వారా మళ్లీ లాగిన్ చేయాల్సి ఉంటుంది. గడువు ఎందుకు పెంచారు? మొదటగా DoT ఈ నిబంధనలకు 90 రోజుల గడువు ఇచ్చింది. దీంతో 2026 ఫిబ్రవరి చివరి వరకు అమలు చేయాల్సి ఉంది. అయితే టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయని కంపెనీలు తెలియజేయడంతో గడువు మిస్ అయింది. ఇప్పుడు డిసెంబర్ వరకు గడువు పెంచే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్,టెస్టింగ్ వంటి అంశాల కారణంగా ఈ ఆలస్యం జరిగిందని చెప్పారు.
వివరాలు
కంపెనీల స్పందన ఎలా ఉంది?
ముఖ్యంగా ఆండ్రాయిడ్'లో ముందుగా అమలు అయ్యే అవకాశం ఉండగా, iOSలో కొన్ని సాంకేతిక పరిమితులు ఉన్నాయని, వాటిని ఆపిల్ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మెటా సంస్థ ఈ నిబంధనల అమలుకు సంబంధించి DoTతో కలిసి పనిచేస్తోందని సమాచారం. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ వర్షన్లో SIM బైండింగ్ బీటా టెస్టింగ్ జరుగుతోంది. అలాగే Arattai సంస్థ గ్లోబల్ ప్రొడక్ట్ హెడ్ జెరి జాన్ మాట్లాడుతూ, DoTతో కలిసి పనిచేస్తున్నామని, అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. వాటిని పరిష్కరించే పనిలో ఉన్నామని,త్వరలో అవసరమైన అప్డేట్స్ విడుదల చేస్తామని చెప్పారు. యూజర్ అనుభవం దెబ్బతినకుండా,కేవలం అవసరమైన సమయంలో SIM చెక్స్,రిస్క్ ఆధారిత వెరిఫికేషన్ చర్యలు మాత్రమే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.