Third Eye: మనుషులకూ మూడో కన్ను ఉందా? దృష్టి పరిణామ రహస్యంపై శాస్త్రవేత్తల కొత్త పరిశోధన
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్లో కనిపించే 'ట్యుటారా' అనే అరుదైన సరీసృపాన్ని పరిశీలిస్తే ఒక విశేషం కనిపిస్తుంది. దాని తలపై పనిచేసే మూడో కన్ను ఉంటుంది.సాధారణంగా రెండు కండ్లకు ఉండే లెన్స్,రెటీనా, మెదడుతో అనుసంధానమైన నర వ్యవస్థ వంటి నిర్మాణాలు ఈ మూడో కంటిలోనూ కనిపిస్తాయి. ఒక వెన్నెముక జీవిలో ఇలాంటి ప్రత్యేక అవయవం ఉండటం ఆశ్చర్యంగా అనిపించినా,శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం మరింత ఆసక్తికరం. వారి ప్రకారం మనుషులలో కూడా దానికి సమానమైన నిర్మాణం ఉంది. మెదడులో లోతుగా,పుర్రె కింద భాగంలో ఉండే 'పీనియల్ గ్రంథి'ని శాస్త్రవేత్తలు ఈ మూడో కంటికి మిగిలిన అవశేషంగా భావిస్తున్నారు. దీనిపై నేరుగా సూర్యకాంతి పడకపోయినా, పగలు-రాత్రి మార్పులకు శరీరం ఎలా స్పందించాలన్న విషయాన్ని నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వివరాలు
పురాతన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వమా?
'కరెంట్ బయాలజీ' పత్రికలో ప్రచురితమైన తాజా పరిశోధన పీనియల్ గ్రంథి మూలాలను అన్వేషించే ప్రయత్నం చేసింది. ఈఅధ్యయనం ప్రకారం మూడో కన్నుభావన మన అత్యంత పురాతన పూర్వీకుల వరకు వెళ్తుంది. ఈరహస్యాన్ని ఛేదించడం ద్వారా దృష్టి వ్యవస్థ పరిణామ క్రమంలో ఉన్న ఒక ప్రధాన ప్రశ్నకు సమాధానం లభించే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈపరిశోధనలో భాగస్వామిగా ఉన్న నాడీ వ్యవస్థ శాస్త్రవేత్త ప్రొఫెసర్ థామస్ బాడెన్ వివరాల ప్రకారం, కోట్లాది సంవత్సరాల క్రితం మన పూర్వీకులు సముద్ర అడుగున జీవించే చిన్న పురుగు తరహా జీవులుగా ఉండేవారు. అవి దిశలను గుర్తించేందుకు తలకు ఇరువైపులా రెండు కండ్లను,కాంతి తీవ్రతను గుర్తించేందుకు తలపై ఒక మధ్య కంటిని కలిగి ఉండి ఉండవచ్చని ఆయన తెలిపారు.
వివరాలు
ఇసుకలో జీవనం.. కండ్లలో మార్పులు
కాలక్రమేణా ఈ జీవుల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వెన్నెముక జీవులుగా రూపాంతరం చెందుతున్న దశలో వాటి పూర్వీకులు తమ తలలను ఇసుకలో పాతుకుని జీవించడం ప్రారంభించాయని పరిశోధకులు చెబుతున్నారు. సముద్ర అడుగున ఉన్న అవక్షేపాల్లో పూడుకుపోయి, నీటిలో తేలియాడే సూక్ష్మ కణాలను ఆహారంగా తీసుకుంటూ జీవించే పరిస్థితి ఏర్పడింది. ఈ జీవన విధానంలో దిశలను గుర్తించే పక్క కండ్ల అవసరం తగ్గిపోయింది. వాటిని నిర్వహించేందుకు అధిక శక్తి అవసరమవడంతో అవి క్రమంగా క్షీణించాయి. చివరకు కాంతి మార్పులను గుర్తించే మధ్య భాగంలోని గ్రాహక కణాల సమూహం మాత్రమే మిగిలింది. పగలు, రాత్రి వంటి మార్పులను గుర్తించడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడుతూ వచ్చింది.
వివరాలు
వెన్నెముక జీవులను ప్రత్యేకంగా మార్చిన పరిణామం
ఈ ఇసుకలో జీవించే దశే వెన్నెముక జీవుల పరిణామంలో కీలక మలుపుగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇతర జంతు వంశాలు తమ అసలు పక్క కండ్లను కొనసాగించగా, వెన్నెముక జీవుల పూర్వీకులు వాటిని కోల్పోయారు. అనంతరం కొత్త రూపంలో కండ్లు మళ్లీ అభివృద్ధి చెందాయని వారు సూచిస్తున్నారు. అయితే పాత కంటి వ్యవస్థ పూర్తిగా అంతరించిపోలేదు. అదే పీనియల్ గ్రంథి రూపంలో ఇప్పటికీ కొనసాగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. సింహాల నుంచి బల్లుల వరకు,మనుషుల వరకు దాదాపు అన్ని వెన్నెముక జీవుల్లో ఈ గ్రంథి కనిపిస్తుంది. ట్యుటారా వంటి కొన్ని సరీసృపాల్లో ఈ నిర్మాణం ఇప్పటికీ దాదాపు పూర్తి కంటిలా అభివృద్ధి చెందింది.
వివరాలు
కంటికంటే ముందుగా ఏర్పడిన వ్యవస్థ?
చేపల్లో ఇది నేరుగా కాంతిని గుర్తించే సరళమైన అవయవంగా పనిచేస్తుంది.క్షీరదాల్లో మాత్రం ఆ సామర్థ్యం తగ్గిపోయింది. వాటిలో ఇది కండ్ల నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా కాంతి సమాచారాన్ని స్వీకరిస్తుంది. ఈ సిద్ధాంతం దృష్టి వ్యవస్థ పరిణామంపై కొత్త అవగాహనను అందిస్తోంది. మన కంటి వెనుక భాగంలో ఉండే కాంతి స్పందన కణజాలమైన రెటీనా మొదటి రూపం ఇప్పటికే ఆ మధ్య కంటి నిర్మాణంలోనే ఉండి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కండ్లలో కనిపించే అనేక లక్షణాలు కొత్తగా ఏర్పడినవి కాకుండా ఆ పురాతన వ్యవస్థ నుంచి వారసత్వంగా వచ్చినవేనని వారు చెబుతున్నారు. అయితే తలపై ఉన్న ఆ నిర్మాణాన్ని పూర్తిస్థాయి కన్నుగా పేర్కొనడం కొంత అతిశయోక్తేనని ప్రొఫెసర్ బాడెన్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఒకప్పుడు నాలుగు కండ్లు ఉండేవా?
ఆయన మాటల్లో చెప్పాలంటే, అది నిజమైన కన్ను కంటే కాంతిని గుర్తించే గ్రాహక కణాల సమూహంగా ఉండి ఉండవచ్చు. ఇటీవల 'నేచర్' పత్రికలో వెలువడిన మరో అధ్యయనం మరింత ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. దాని ప్రకారం మన పూర్వీకులకు ఒక దశలో లెన్స్లు, రెటీనాలతో కూడిన నాలుగు కండ్లు ఉండి ఉండవచ్చని సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సిద్ధాంతాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. దాదాపు 50 కోట్ల సంవత్సరాల పరిణామ చరిత్రను ఆధారాలతో నిరూపించడం అంత సులభమైన విషయం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ కొనసాగుతున్న పరిశోధనలతో సమీప భవిష్యత్తులో మరిన్ని స్పష్టమైన సమాధానాలు లభించే అవకాశముందని ప్రొఫెసర్ బాడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.