India Smartphone Market: భారత్లో స్మార్ట్ఫోన్ మార్కెట్ 11% క్షీణత.. చైనా బ్రాండ్లకు భారీ దెబ్బ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ మందగించింది.పెరుగుతున్న ఫోన్ ధరల ప్రభావంతో చైనా బ్రాండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. జూన్తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు ఏడాది ప్రాతిపదికన 11.1శాతం తగ్గి 3.32కోట్ల యూనిట్లకు చేరాయి. మెమరీ చిప్ల ధరలు భారీగా పెరగడంతో ఫోన్ల ధరలు పెరిగాయి. దీంతో వినియోగదారుల కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా చాలా వరకు చైనా బ్రాండ్ల అమ్మకాలు రెండంకెల స్థాయిలో తగ్గాయి. మరోవైపు శాంసంగ్,ఆపిల్ మాత్రం తమ షిప్మెంట్లను దాదాపు స్థిరంగా కొనసాగించాయి. మార్కెట్లో వాటి వాటా పెరిగింది. ప్రస్తుతం భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయగల సామర్థ్యం, బలమైన సరఫరా వ్యవస్థ, ప్రీమియం ఫోన్ల పోర్ట్ఫోలియో ఉన్న కంపెనీలకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
వివరాలు
వివోకు ఎదురుదెబ్బ.. తగ్గిన షిప్మెంట్లు
IDC Worldwide Quarterly Mobile Phone Tracker ప్రకారం.. 2026 తొలి ఆరు నెలల్లో భారత్లో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 7.9 శాతం తగ్గి 6.42 కోట్ల యూనిట్లకు చేరాయి.
గత ఐదేళ్లలో ఇదే అత్యల్ప తొలి అర్ధవార్షిక విక్రయ పరిమాణం. అయితే మార్కెట్ విలువ మాత్రం 3.6 శాతం పెరిగింది.
ఫోన్ తయారీదారులు పెరిగిన విడిభాగాల ధరలను వినియోగదారులపై మోపడం, డిస్కౌంట్లను తగ్గించడం వల్ల సగటు విక్రయ ధర గణనీయంగా పెరిగింది.
భారత్లో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన స్మార్ట్ఫోన్ బ్రాండ్గా వివో కొనసాగుతోంది.
అయితే రెండో త్రైమాసికంలో ఆ కంపెనీ షిప్మెంట్లు 13.9 శాతం తగ్గాయి.
దీంతో మార్కెట్ వాటా గతేడాది 19 శాతం నుంచి 18.4 శాతానికి పడిపోయింది.
వివరాలు
చైనా బ్రాండ్లకు ఎదురుదెబ్బ.. శాంసంగ్, ఆపిల్కు పెరిగిన వాటా
ఒప్పో షిప్మెంట్లు 8.5శాతం,షావోమీ 10శాతం, రియల్మీ 14.2శాతం తగ్గాయి. పోకో 12.3శాతం క్షీణించింది.
ప్రధాన బ్రాండ్లలో ఐక్యూ (iQOO) అత్యంత తీవ్రంగా దెబ్బతింది. ఆ కంపెనీ షిప్మెంట్లు ఏకంగా 61 శాతం పడిపోయాయి.
శాంసంగ్ మాత్రం దీనికి భిన్నంగా స్వల్ప వృద్ధిని నమోదు చేసింది.
ఆ కంపెనీ షిప్మెంట్లు 0.4శాతం పెరగడంతో మార్కెట్ వాటా 14.5 శాతం నుంచి 16.4 శాతానికి చేరింది.
ఆపిల్ షిప్మెంట్లు కూడా 0.7 శాతం పెరిగాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ వాటా 7.5 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది.
ఇతర ప్రధాన బ్రాండ్లలో మోటరోలా, వన్ప్లస్ కొంత మెరుగైన పనితీరు కనబరిచాయి. మోటరోలా షిప్మెంట్లు 8.9 శాతం, వన్ప్లస్ షిప్మెంట్లు 2.5 శాతం తగ్గాయి.
వివరాలు
చౌక ఫోన్లకు భారీ దెబ్బ.. 74.3% తగ్గిన షిప్మెంట్లు
ఈ కంపెనీల మధ్య కనిపిస్తున్న తేడాలకు భారత్లో స్మార్ట్ఫోన్ మార్కెట్ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని విశ్లేషణలు చెబుతున్నాయి.
చైనా బ్రాండ్లు గతంలో ఎక్కువగా తక్కువ ధర,అధిక పరిమాణంలో అమ్ముడయ్యే ఫోన్లపై ఆధారపడ్డాయి.
అయితే మెమరీ,ఇతర విడిభాగాల ధరలు పెరగడంతో ఈ విభాగంలో తక్కువ ధరలకు ఫోన్లను విక్రయిస్తూ లాభాలు సాధించడం కంపెనీలకు కష్టంగా మారింది.
మార్కెట్లో ఈ ప్రభావం ముఖ్యంగా అత్యంత చౌకైన ఫోన్ల విభాగంలో స్పష్టంగా కనిపించింది.
100 డాలర్ల కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు రెండో త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన ఏకంగా 74.3 శాతం పడిపోయాయి.
దీంతో ఈ విభాగం మార్కెట్ వాటా 15.6 శాతం నుంచి కేవలం 4.5 శాతానికి తగ్గింది.
వివరాలు
ఖరీదైన ఫోన్ల వైపు వినియోగదారుల మొగ్గు
ఎంట్రీ లెవల్ ఫోన్ల ధరలు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది వినియోగదారులు అదే ధర శ్రేణిలో ఉండకుండా మరింత ఖరీదైన ఫోన్ల వైపు వెళ్తున్నారు.
400 నుంచి 600 డాలర్ల ధర ఉన్న స్మార్ట్ఫోన్ల విభాగం ఏడాది ప్రాతిపదికన 60.3 శాతం పెరిగింది.
ఈ విభాగం మార్కెట్ వాటా 4.8 శాతం నుంచి దాదాపు రెట్టింపై 8.6 శాతానికి చేరింది.
అయితే 100 నుంచి 200 డాలర్ల ధర కలిగిన మాస్ మార్కెట్ విభాగం మాత్రం పెద్దగా మారలేదు.
మొత్తం మార్కెట్లో ఈ విభాగం 46.8 శాతం వాటాను కలిగి ఉంది.
ఫోన్ల ధరలు పెరుగుతున్న సమయంలో వినియోగదారులకు అందుబాటులో ఉండే కీలకమైన ధర శ్రేణిగా ఇది నిలిచింది.
వివరాలు
ధరల పెరుగుదలతో మళ్లీ పెరిగిన 4జీ ఫోన్ల డిమాండ్
మరోవైపు 4జీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ మళ్లీ పెరిగింది. రెండో త్రైమాసికంలో 4జీ ఫోన్ల వాటా అంతకుముందు త్రైమాసికంలోని 5.8శాతం నుంచి 11.1శాతానికి పెరిగింది.
ఎంట్రీ లెవల్ 5జీ ఫోన్ల ధరలు పెరగడంతో వాటికి ప్రత్యామ్నాయంగా కంపెనీలు తక్కువ ధర కలిగిన 4జీ మోడళ్లను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చాయి.
అయితే ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమేనని IDC అంచనా వేస్తోంది.
ప్రస్తుతం ఉన్న 4జీ ఫోన్ల నిల్వలు పూర్తయ్యాక వినియోగదారులు క్రమంగా ఖరీదైన 5జీ ఫోన్ల వైపు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది.
మొత్తంగా రెండో త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ల సగటు విక్రయ ధర ఏడాది ప్రాతిపదికన 14.4శాతం పెరిగి రికార్డు స్థాయిలో 315డాలర్లకు చేరింది.
వివరాలు
పెరిగిన ధరలు.. పండుగ సీజన్పై ఆశలు
ఫోన్ కంపెనీలు, రిటైలర్లు ఆఫర్లు, ప్రమోషన్లను తగ్గించిన సమయంలోనే ధరలు పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది.
"2026 రెండో త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ల సగటు విక్రయ ధర ఏడాది ప్రాతిపదికన 14.4 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 315 డాలర్లకు చేరింది. మెమరీ ధరల పెరుగుదల ప్రభావం అన్ని రకాల ఫోన్లపై కనిపించింది" అని IDC ఆసియా పసిఫిక్ డివైసెస్ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య రాంపాల్ తెలిపారు.
పండుగల సీజన్లో వినియోగదారుల డిమాండ్ను కొనసాగించాలంటే సులభమైన ఫైనాన్సింగ్ సదుపాయాలు కీలకంగా మారతాయని ఆయన చెప్పారు.
ముఖ్యంగా మిడ్-ప్రీమియం విభాగంలో ఉత్పత్తుల్లో ప్రత్యేకత చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
ఆన్లైన్ అమ్మకాలు డౌన్.. ఆపిల్కు మాత్రం పెరిగిన ఆదరణ
ఆన్లైన్ డిస్కౌంట్ల ప్రభావం తగ్గడంతో ఫోన్ విక్రయాల విధానంలోనూ మార్పు కనిపిస్తోంది.
ఆన్లైన్ షిప్మెంట్లు ఏడాది ప్రాతిపదికన 19.8శాతం తగ్గాయి. దీంతో మొత్తం మార్కెట్లో ఆన్లైన్ వాటా 46.4 శాతం నుంచి 41.9 శాతానికి పడిపోయింది.
ఆఫ్లైన్ షిప్మెంట్లు మాత్రం కేవలం 3.6 శాతం తగ్గాయి. దీంతో ఆఫ్లైన్ మార్కెట్ వాటా 53.6 శాతం నుంచి 58.1 శాతానికి పెరిగింది.
ప్రీమియం ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్తో యాపిల్ ఎక్కువగా లాభపడిన కంపెనీగా నిలిచింది.
ఐఫోన్ 15, 16, 17 మోడళ్ల సరఫరాలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ యాపిల్ షిప్మెంట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి.
2026 తొలి, రెండో త్రైమాసికాల్లో ఐఫోన్ 17 అత్యధికంగా రవాణా అయిన స్మార్ట్ఫోన్ మోడల్గా నిలిచింది.
వివరాలు
స్మార్ట్ఫోన్ మార్కెట్కు మున్ముందు గడ్డుకాలమే..
మార్కెట్ విలువ పరంగా యాపిల్ 27 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే యాపిల్ మార్కెట్ విలువ వాటా 22.2 శాతం పెరిగింది.
అయితే రానున్న రోజుల్లో మార్కెట్ పరిస్థితులు సవాలుగా ఉండే అవకాశం ఉందని IDC అంచనా వేస్తోంది.
2026 రెండో అర్ధభాగంలో స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 15 శాతానికి పైగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
దీంతో ఏడాది మొత్తం షిప్మెంట్లు సుమారు 12.8 కోట్ల నుంచి 13 కోట్ల యూనిట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.
వివరాలు
స్మార్ట్ఫోన్ మార్కెట్కు మున్ముందు గడ్డుకాలమే..
"వినియోగదారుల డిమాండ్ పూర్తిగా తగ్గిపోలేదు. కొనుగోలు చేసేందుకు వారు మరింత కాలం వేచి చూస్తున్నారు" అని IDC ఆసియా పసిఫిక్ డివైసెస్ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి తెలిపారు.
ఫోన్ల ధరలు పెరగడం, పండుగల సీజన్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లేకపోవడం వల్ల వినియోగదారులు ఫోన్ అప్గ్రేడ్ను మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.