LOADING...
Instagram: పిల్లల భద్రతపై ఆందోళన.. ఇన్‌స్టాగ్రామ్‌పై బీబీసీ సంచలన కథనం
పిల్లల భద్రతపై ఆందోళన.. ఇన్‌స్టాగ్రామ్‌పై బీబీసీ సంచలన కథనం

Instagram: పిల్లల భద్రతపై ఆందోళన.. ఇన్‌స్టాగ్రామ్‌పై బీబీసీ సంచలన కథనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram)పై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ (BBC) సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్‌లో చిన్నారుల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన అనుచిత కంటెంట్‌ను ప్రోత్సహించే ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తున్నాయని ఆ కథనంలో ఆరోపించింది. చిన్నారుల భద్రతకు ముప్పుగా మారే పోస్టులు, ప్రకటనలు యూజర్లకు సిఫారసు అవుతున్నాయని పేర్కొంది. బీబీసీ కథనం ప్రకారం, కొంతమంది యూజర్లకు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను సూచించే పదాలు, ప్రకటనలు కనిపించడంతో పాటు, వాటి ద్వారా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లే లింకులు కూడా అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. అలాంటి ప్రకటనల ద్వారా చెల్లింపు చేసి వీడియోలు పొందవచ్చని సూచించే సందేశాలు కూడా కనిపించినట్లు కథనంలో వెల్లడించింది.

వివరాలు 

స్పందించిన మెటా

సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ ప్రకటన అయినా ప్రచురితమయ్యే ముందు సంస్థ మోడరేషన్ వ్యవస్థ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుచిత ప్రకటనలు ఎలా ఆమోదం పొందాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీబీసీ పేర్కొంది. అయితే తమ ప్రకటనలు కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే ఉంటాయని ఇన్‌స్టాగ్రామ్ వర్గాలు స్పందించినట్లు కథనంలో వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా (Meta) కూడా ఈ అంశంపై స్పందించింది. నేరప్రవృత్తిని ప్రోత్సహించేలా ఉన్న అనేక వాణిజ్య ప్రకటనలను నిలిపివేసినట్లు, పెద్ద సంఖ్యలో అనుమానాస్పద ఖాతాలను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. అలాగే తమ విధానాలను ఉల్లంఘించిన పలు యూఆర్ఎల్స్‌ను కూడా తొలగించినట్లు వెల్లడించింది.

వివరాలు 

మూడు లక్షల గ్రూపులు,ఛానళ్లను తొలగించినట్లు ప్రకటించిన టెలిగ్రామ్ 

అదే సమయంలో టెలిగ్రామ్ (Telegram) కూడా చిన్నారుల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌పై చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు అలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సుమారు మూడు లక్షల గ్రూపులు, ఛానళ్లను తొలగించినట్లు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుచిత కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలు ఎలా ప్రదర్శితమవుతున్నాయో వివరిస్తూ బీబీసీ తన ఆన్‌లైన్ కథనంలో పలు ఉదాహరణలను పొందుపరిచింది. పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియా సంస్థలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కథనం సూచించింది.

Advertisement

వివరాలు 

చిన్నారుల లైంగిక దుర్వినియోగాన్ని గుర్తించే ఆల్గారిథమ్

చిన్నారుల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు అమెరికాలో ఎన్‌సీఎంఈసీ (NCMEC) నిర్వహించే సైబర్ టిప్‌లైన్ వ్యవస్థ పనిచేస్తోంది. భారత్‌లో కూడా ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థ ఉందని,2025లో దాదాపు 19లక్షల ఫిర్యాదులు నమోదైనట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదుల్లో ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ వేదికల నుంచే ఎక్కువ కేసులు వస్తున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభిప్రాయపడినట్లు బీబీసీ పేర్కొంది. చిన్నారుల లైంగిక దుర్వినియోగాన్ని గుర్తించే ఆల్గారిథమ్ ఎంత సమర్థంగా పనిచేస్తే,అంత ఎక్కువ సంఖ్యలో అలర్ట్‌లు వెలువడతాయని ఆమె వివరించినట్లు కథనంలో వెల్లడించింది. ఈ ప్రత్యేక కథనాన్ని బీబీసీలో పనిచేస్తున్న అవార్డుగ్రహీత జర్నలిస్టు దివ్యా ఆర్యా రచించారు. అనంతరం బీబీసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కథనాన్ని ప్రచురించింది.

Advertisement