Loading...
Tibetan Plateau: టిబెటన్‌ పీఠభూమి మరింత అస్థిరంగా మారుతోందా?
టిబెటన్‌ పీఠభూమి మరింత అస్థిరంగా మారుతోందా?

Tibetan Plateau: టిబెటన్‌ పీఠభూమి మరింత అస్థిరంగా మారుతోందా?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 30, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియాకు 'వాటర్‌ టవర్‌'గా పిలిచే టిబెటన్‌ పీఠభూమి క్రమంగా మరింత అస్థిరంగా, అనూహ్యంగా మారుతోందని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ప్రాంతంలోని సంక్లిష్ట వ్యవస్థలో ఎంత మేరకు అస్థిరత, క్రమరాహిత్యం పెరుగుతోందో తెలుసుకునేందుకు పరిశోధకులు 'ఎంట్రోపీ'ని విశ్లేషించారు. ఈ అధ్యయనాన్ని నేచుర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించారు. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దును భారీ వరద ముంచెత్తి వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, తీవ్ర విధ్వంసం జరిగిన కొద్ది రోజుల ముందే ఈ అధ్యయనం వెలువడటం గమనార్హం.

వివరాలు

హిమాలయాల పరిధిలోని దేశాలకు పెరగనున్న ముప్పు..

టిబెటన్‌ పీఠభూమిలో నేలలోని నీటి పరిమాణం పెరగడం, హిమానీనదాలు వేగంగా కరుగుతుండటం ఈ శతాబ్దం చివరి వరకు కొనసాగుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన చెన్‌ జియాసోంగ్‌ హెచ్చరించారు.

ఈ పరిణామాలు భవిష్యత్తులో ఇలాంటి భౌగోళిక విపత్తులకు కారణమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఈ అంచనాల ప్రకారం హిమాలయాల పరిధిలో ఉన్న దేశాలకు ఇలాంటి విపత్తుల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది.

''భారత్‌ కూడా కచ్చితంగా ప్రభావితమవుతుంది. అయితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది తెలుసుకోవడానికి మరింత విశ్లేషణ, పరిశోధన అవసరం'' అని చెన్‌ తెలిపారు.

వివరాలు

నేల తేమ వ్యవస్థపై అధ్యయనం..

చెన్‌ నేతృత్వంలోని పరిశోధకుల బృందం 2000 నుంచి 2024 వరకు టిబెటన్‌ పీఠభూమిలోని నేల తేమ వ్యవస్థను అధ్యయనం చేసింది.

ఈ వ్యవస్థ నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది.

టిబెటన్‌ పీఠభూమిలో చోటుచేసుకునే మార్పులు దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంతాల్లోని దాదాపు 200 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధన వెల్లడించింది.

ఈ ప్రాంతంలోని నీరు, వాతావరణ వ్యవస్థల్లో వచ్చే మార్పులు ఎంత విస్తృతమైన ప్రభావాలను చూపగలవో తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

ADVERTISEMENT