LOADING...
JioStar: కంటెంట్ క్రియేషన్‌లో కొత్త విప్లవం.. ఏఐ ఆధారిత 'జామ్స్' ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిన జియోస్టార్
కంటెంట్ క్రియేషన్‌లో కొత్త విప్లవం..

JioStar: కంటెంట్ క్రియేషన్‌లో కొత్త విప్లవం.. ఏఐ ఆధారిత 'జామ్స్' ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిన జియోస్టార్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ మీడియా,ఎంటర్‌టైన్‌మెంట్ విభాగమైన జియోస్టార్ కంటెంట్ సృష్టిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన జియోస్టార్ జెన్‌ఏఐ మీడియా స్టూడియో (జామ్స్ - JAMS)ను శుక్రవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆకాష్ అంబానీ ప్రకటించారు. దేశంలో కంటెంట్ ప్రొడక్షన్ రంగాన్ని మరింత వేగవంతంగా, సులభంగా మార్చే లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జామ్స్ కేవలం వీడియోలు లేదా కార్యక్రమాలను రూపొందించే సాధనం మాత్రమే కాదు.. ఏఐ టెక్నాలజీని సృజనాత్మక కథనాలతో మేళవించి, ఒక ఆలోచనను పూర్తి స్థాయి కంటెంట్‌గా మార్చే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది.

వివరాలు 

అందుబాటులోకి 'ఏఐ స్నాప్‌షాట్' ఫీచర్

స్క్రిప్ట్ రూపకల్పన నుంచి ఎడిటింగ్, వివిధ భాషల్లోకి అనువాదం, పలు ఫార్మాట్లలో ప్రచురణ వరకు మొత్తం ప్రక్రియను ఒకే వేదికపై నిర్వహించేలా దీనిని రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేకంగా 'ఏఐ స్నాప్‌షాట్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా పెద్ద కంటెంట్‌ను తక్కువ సమయంలో ముఖ్యాంశాల రూపంలో వీక్షించవచ్చు. అలాగే కార్యక్రమాలను చూస్తూనే అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేసే 'ఇన్-షో షాపింగ్' సదుపాయాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. దీంతో కంటెంట్ క్రియేటర్లు, మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఇది సమగ్ర పరిష్కారంగా మారనుంది.

వివరాలు 

రోజుకు జియోస్టార్ నెట్‌వర్క్‌ను వీక్షిస్తున్న 38.9 కోట్ల మంది వీక్షకులు

జియోస్టార్ విలీనానంతరం తొలి ఆర్థిక సంవత్సరంలోనే విశేష ఫలితాలు సాధించినట్లు సంస్థ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.34,917 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన జియోస్టార్, టెలివిజన్ వీక్షణలో 34.7 శాతం వాటాను దక్కించుకుంది. రోజుకు సుమారు 38.9 కోట్ల మంది వీక్షకులు జియోస్టార్ నెట్‌వర్క్‌ను వీక్షిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు, జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ సేవ కూడా రికార్డు స్థాయిలో వృద్ధి సాధించింది. ప్రస్తుతం ఈ యాప్‌కు నెలకు 45.1 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. భారత్ టీ20 ప్రపంచకప్ విజయం సందర్భంగా ఏకకాలంలో 7.25 కోట్ల మంది వీక్షకులు స్ట్రీమింగ్‌ను వీక్షించడం ద్వారా కొత్త రికార్డు నమోదైంది.

Advertisement

వివరాలు 

ఒక బిలియన్ డౌన్‌లోడ్స్‌ను దాటిన తొలి చెల్లింపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా జియోహాట్‌స్టార్

జియోహాట్‌స్టార్ ప్రపంచవ్యాప్తంగా పలు మైలురాళ్లను కూడా అధిగమించింది. భారతదేశంలో ఒక బిలియన్ డౌన్‌లోడ్స్‌ను దాటిన తొలి చెల్లింపు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. దేశంలోని 99 శాతం కనెక్టెడ్ టీవీల్లో ఈ సేవ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన మైక్రో కంటెంట్ హబ్ 'తడ్కా' ప్రారంభమైన రెండు నెలల్లోనే 10 కోట్లకు పైగా వినియోగదారులను సంపాదించడం విశేషం. ఏఐ, డిజిటల్ స్ట్రీమింగ్, కొత్త తరహా కంటెంట్ అనుభవాలతో భారత మీడియా రంగంలో జియోస్టార్ మరో ముందడుగు వేసినట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement