Meta: విశాఖపట్టణంలో 500MW AI డేటా సెంటర్ను లీజ్కు తీసుకోబోతున్న మెటా
ఈ వార్తాకథనం ఏంటి
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫార్మ్లకు పేరెంట్ కంపెనీ అయిన మెటా, సైఫీ టెక్నాలజీస్తో కలిసి విశాఖపట్టణంలో భారీగా 500 మెగావాట్ల AI డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కోల్కతా-శ్రీకాకుళం నేషన్ల్ హైవే పక్కన ఉన్న పరదేశిపాలెం గ్రామంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. నిర్మాణం పూర్తయ్యాక మొత్తం ఫెసిలిటీని మెటా లీజ్కు తీసుకోనుంది. మెటా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న AI సేవలు, అలాగే సైఫీ ఏర్పాటు చేస్తున్న 'వాటర్వర్త్'(Waterworth) అనే భారీ సబ్సీ కేబుల్ ప్రాజెక్టు ఇక్కడి ల్యాండింగ్ స్టేషన్తో కనెక్ట్ అవుతుంది.
ప్రాజెక్ట్ వివరాలు
సైఫీ ₹15,266 కోట్లు పెట్టుబడి
ఈ హైపర్స్కేల్ ప్రాజెక్టులో సైఫీ సుమారు ₹15,266 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్.. రాక్స్ వరకు ఉండే సెటప్.. అన్నిటినీ సైఫీనే అభివృద్ధి చేస్తుంది. సాధారణంగా ఇటువంటి డేటా సెంటర్లు రాక్స్లో ఏర్పాటు చేసే GPUలు, TPUలు వంటి ప్రాసెసింగ్ యూనిట్లను కలిగి ఉంటాయి. ఇవి NVIDIA వంటి కంపెనీల నుండి కొనుగోలు చేయవచ్చు లేదా హైర్ చేసుకోవచ్చు.
వ్యూహాత్మక ఎత్తుగడ
మెటా నిర్మిస్తున్న 50,000 కిలోమీటర్ల పొడవైన 'వాటర్వర్త్'
భారతదేశంలో ఇలాంటి భారీ స్థాయి డేటా ఇన్ఫ్రాను మెటా మొదటిసారి లీజ్కు తీసుకుంటోంది. ప్రపంచంలోనే అతి పెద్ద AI సర్వీసుల మార్కెట్గా ఎదుగుతున్న భారత సామర్థ్యాన్ని మెటా వినియోగించుకునే ప్రయత్నాల్లో ఇది ఒకటి. అంతేకాదు, మెటా నిర్మిస్తున్న 50,000 కిలోమీటర్ల పొడవైన 'వాటర్వర్త్' అండర్సీ కేబుల్ ముంబై, విశాఖపట్టణం తీరాలకు చేరనుంది. అమెరికా, భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర మార్గ కేబుల్ వ్యవస్థగా ఇది నిలవనుంది.
ప్రాంతీయ ప్రభావం
డేటా సెంటర్ ఎకోసిస్టమ్లో తొలి కంపెనీ సైఫీ
మెటాతో ఈ భాగస్వామ్యం, సైఫీకి ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద కస్టమర్ కమిట్మెంట్లలో ఒకటిగా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 6GW డేటా సెంటర్ ఎకోసిస్టమ్లో తొలి కంపెనీల్లో సైఫీ ఒకటి. గూగుల్ 1GW డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేస్తుండగా, సైఫీకి 550MW కేటాయించారు. సైఫీ మొదటి AI డేటా సెంటర్.. 50MW సామర్థ్యం కలిగినది.. మధురవాడలో ప్రారంభం కానుంది.
ఎమర్జింగ్ ట్రెండ్
డేటా సెంటర్ రంగంలో ఆంధ్రప్రదేశ్
డేటా సెంటర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా హబ్గా ఎదుగుతోంది. ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ (1GW), టిల్మాన్ గ్లోబల్ (300MW), ఆనత్ రాజ్ క్లౌడ్ (117MW) వంటి కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్ స్థాపనకు ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రం పొడవైన తీర రేఖను ఉపయోగించుకుని అండర్సీ కేబుల్ ప్రాజెక్టులకు కేంద్రంగా అవుతోంది. తూర్పు తీరంలో నుంచే దక్షిణాసియా మార్కెట్లలోకి సులభంగా కనెక్ట్ కావచ్చనే ఉద్దేశంతోే కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు తెలిపారు.