Windows 10: విండోస్ 10 వినియోగదారులకు మరో ఏడాది భద్రతా అప్డేట్లతో మైక్రోసాఫ్ట్ ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్కు సాధారణ సపోర్ట్ను మైక్రోసాఫ్ట్ ఇప్పటికే నిలిపివేసింది. ఆ సమయంలో విండోస్ 11కు అవసరమైన హార్డ్వేర్ లేని వినియోగదారులు ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ (ESU) ప్రోగ్రామ్లో చేరాలని లేదా కొత్త కంప్యూటర్కు మారాలని సంస్థ సూచించింది. అయితే ఈ ప్రోగ్రామ్కు కూడా ఈ ఏడాది అక్టోబర్తో గడువు ముగియాల్సి ఉండగా, తాజాగా మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్యూ ప్రోగ్రామ్ను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్కు మారలేకపోయిన లేదా కొత్త పీసీ కొనుగోలు చేయలేని విండోస్ 10 వినియోగదారులకు అదనపు వెసులుబాటు లభించినట్లైంది.
వివరాలు
మరో ఏడాది పాటు భద్రతా అప్డేట్లు..
మైక్రోసాఫ్ట్ తన అధికారిక సపోర్ట్ పేజీలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ (ESU) ప్రోగ్రామ్లో ఉన్న విండోస్ 10 వినియోగదారులు మరో ఏడాది పాటు భద్రతా అప్డేట్లను పొందుతారు. అంటే 2027 అక్టోబర్ వరకు సెక్యూరిటీ అప్డేట్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈఎస్యూ ప్రోగ్రామ్లో నమోదు చేసుకున్న వారికి ఎలాంటి అదనపు ప్రక్రియ అవసరం లేదు.
వివరాలు
సబ్స్క్రిప్షన్లో భాగంగా లభించనివి ఇవే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇప్పటికీ విండోస్ 10నే ఉపయోగిస్తున్నారు. వీరంతా విండోస్ 11కు అప్గ్రేడ్ అయ్యేలా చేయడమే మైక్రోసాఫ్ట్ ప్రధాన లక్ష్యం. అయితే వివిధ కారణాల వల్ల విండోస్ 10లోనే కొనసాగాలనుకునే వారు చెల్లింపు ఆధారిత ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ (ESU) సబ్స్క్రిప్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా కేవలం భద్రతా అప్డేట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొత్త ఫీచర్లు, డిజైన్లో మార్పులు లేదా భద్రతకు సంబంధం లేని ఇతర అప్డేట్లు ఈ సబ్స్క్రిప్షన్లో భాగంగా లభించవు.