Mind Control: వైరల్ అవుతున్న 'మైండ్ కంట్రోల్' టెక్నాలజీ.. నిజం ఏమిటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
టీవీ,కంప్యూటర్ స్క్రీన్ల ద్వారా మనిషి మెదడును నియంత్రించవచ్చన్న ఒక పేటెంట్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2001లో దాఖలు చేసిన ఈ అమెరికా పేటెంట్ పేరు"Nervous System Manipulation by Electromagnetic Fields from Monitors"అని డైలీ మెయిల్ వెల్లడించింది. స్క్రీన్ ముందు ఎక్కువసేపు గడిపితే మన శరీరంలోని సంచేతన వ్యవస్థపై ప్రభావం చూపే సాంకేతికత గురించి ఇందులో ప్రస్తావించారు. పాత తరహా CRT టీవీలు లేదా కంప్యూటర్ మానిటర్ల నుంచి వెలువడే కనిపించని ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలతో మనిషి శరీరం,మెదడుపై ప్రభావం చూపవచ్చని పేటెంట్లో వివరించారు. చాలా స్వల్పశక్తి గల ఈ తరంగాలు నిర్దిష్ట నెమ్మదైన ఫ్రీక్వెన్సీల్లో పల్స్ల రూపంలో వస్తే, మన శరీరంలో కొలిచే విధమైన మార్పులు కనిపించవచ్చని చెప్పింది.
వివరాలు
నాసాలో పని చేసిన హెన్డ్రికస్ జి. లూస్ ఈ పేటెంట్ను రూపొందించారు
చర్మం ద్వారా నర్వస్ సిస్టమ్ను ఉత్తేజితం చేసి నియంత్రించవచ్చన్నది ఆ సిద్ధాంతం. ఈ పేటెంట్ను రూపొందించిన హెన్డ్రికస్ జి. లూస్ అనే వ్యక్తి ఒకప్పుడు నాసాలో పనిచేశారని సమాచారం. హృదయ స్పందన, జీర్ణక్రియ వంటి ఆటోనామిక్ వ్యవస్థలపై కూడా ఈ సిగ్నల్స్ ప్రభావం చూపవచ్చని ఆయన భావించారట. 0.1 నుంచి 15 హెర్ట్జ్ మధ్య తక్కువ ఫ్రీక్వెన్సీతో స్క్రీన్ ఫ్లికర్ అయితే ప్రభావం ఉంటుందని పేటెంట్ చెబుతోంది. సోమవారం నుంచి ఈ పేటెంట్ను 2 లక్షల మందికిపైగా వీక్షించడంతో సోషల్ మీడియాలో భయాందోళనలు మొదలయ్యాయి.
వివరాలు
టీవీ ద్వారా బ్రెయిన్వాష్ చేస్తున్నారు
2021లో ఈ పేటెంట్ గడువు ముగిసింది. దీంతో ఇప్పుడు ఎవరైనా ఈ టెక్నాలజీని ఉపయోగించవచ్చన్న చర్చ జరుగుతోంది. "టీవీ ద్వారా బ్రెయిన్వాష్ చేస్తున్నారు" అంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఇది ఎక్కువగా పాత తరహా మానిటర్లతో మాత్రమే సాధ్యమై ఉండొచ్చని చెబుతున్నారు. ఆధునిక LED స్క్రీన్లు చాలా తక్కువ ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విడుదల చేస్తాయని, కాబట్టి ప్రస్తుతం ఇది సాధ్యంకాకపోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 2017లో లూస్ మరణించారని, ఇలాంటి మాగ్నెటిక్ ఫీల్డ్స్, నర్వస్ సిస్టమ్కు సంబంధించిన మరికొన్ని పేటెంట్లు కూడా ఆయన దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ అంశంపై చర్చ మరింత వేడెక్కింది.