
Shubhanshu Shukla: నమస్తే ఇండియా.. రోదసినుంచి శుభాంశు శుక్లా భావోద్వేగ సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
కోట్లాది మంది భారతీయుల ఆశయాలను మోసుకెళ్తూ భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా విజయవంతంగా రోదసిలోకి ప్రవేశించారు. యాక్సియం-4 (Axiom-4) మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్తూ ఫాల్కన్ 9 రాకెట్ బుధవారం మధ్యాహ్నం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం 12:01 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన వ్యోమనౌక భూకక్ష్యలోకి ప్రవేశించింది. 41 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి అంతరిక్షాన్ని చేరుకోవడంపై శుభాంశు శుక్లా భావోద్వేగంతో భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
Details
అందరూ భాగస్వాములు కావాలి
'నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ఇప్పుడు మేం భూ కక్ష్యలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని చూసినప్పుడు నాతో మీరు అందరూ ఉన్నారనిపిస్తోంది. ఇది కేవలం నా అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు, భారత మానవ సహిత రోదసి యాత్రకు నాంది. ఈ ప్రయాణంలో మీరందరూ భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నా. మన దేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని అందరం కలిసే ప్రారంభిద్దాం. జై హింద్, జై భారత్' అని శుభాంశు శుక్లా అన్నారు.
Details
రోదసీ నుంచి ముచ్చటించే కార్యక్రమం
ఇక అంతరిక్ష నౌక 28 గంటల ప్రయాణం అనంతరం గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం కానుంది. ఐఎస్ఎస్లో శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం 14 రోజుల పాటు ఉంటూ, భారరహిత స్థితిలో పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. అలాగే ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో రోదసి నుంచి ముచ్చటించే కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. భారత్ మానవ అంతరిక్ష కార్యక్రమానికి ఈ ఘట్టం నూతన ఉత్సాహాన్ని, శుభారంభాన్ని అందిస్తోందని అంతరిక్ష శాస్త్రవేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.