NASA: అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లు?.. మార్స్ రాళ్లలో సంక్లిష్ట కార్బన్ను గుర్తించిన నాసా రోవర్
ఈ వార్తాకథనం ఏంటి
అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల కోసం సాగుతున్న పరిశోధనల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాసాకు చెందిన పర్సివీరెన్స్ రోవర్ అంగారక గ్రహంలోని రాళ్లలో సంక్లిష్ట కార్బన్ అణువులను గుర్తించింది. ఒకప్పుడు అక్కడ సూక్ష్మజీవులు జీవించి ఉండే అవకాశాలపై ఇప్పటికే పరిశోధనలు సాగుతున్న ప్రాంతంలోనే ఈ ఆవిష్కరణ జరగడం శాస్త్రవేత్తల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ విషయాన్ని ది గార్డియన్ వెల్లడించింది. పర్సివీరెన్స్ రోవర్ బిలియన్ల సంవత్సరాల క్రితం నీటిని జెజెరో క్రేటర్లోకి తీసుకువచ్చిన పురాతన ఎండిపోయిన నది మార్గమైన నెరెట్వా వల్లిస్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రైట్ ఏంజెల్ అనే రాతి ప్రాంతంలోని బురదరాళ్లలో సేంద్రియ కార్బన్ను గుర్తించింది. ఇందుకోసం రోవర్లోని షెర్లాక్ (Sherloc) పరికరాన్ని ఉపయోగించారు.
వివరాలు
శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..
శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కార్బన్ను మ్యాక్రోమాలిక్యులర్ కార్బన్ (MMC) అని పిలుస్తారు. ఇది జీవుల నుంచి ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ, భౌగోళిక ప్రక్రియల వల్ల కూడా ఉత్పత్తి కావచ్చు. అందువల్ల ఈ ఆవిష్కరణను అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదనే విషయానికి ప్రత్యక్ష ఆధారంగా పరిగణించలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అరిజోనాలోని ప్లానెటరీ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ యాష్లీ మర్ఫీ మాట్లాడుతూ, మ్యాక్రోమాలిక్యులర్ కార్బన్ అనేక రకాల వాతావరణాల్లో, వివిధ రకాల రాళ్లలో కనిపిస్తుందని చెప్పారు. సూక్ష్మజీవుల పొరలు, బొగ్గు వంటి ప్రాంతాల్లో లభించే శిలాజ సేంద్రియ పదార్థాల నుంచి ఇది ఉత్పత్తి కావచ్చని, ఉల్కల ద్వారా కూడా అంగారక గ్రహానికి చేరి ఉండే అవకాశం ఉందని ఆమె వివరించారు.
వివరాలు
సంక్లిష్ట కార్బన్ గుర్తింపు..
బ్రైట్ ఏంజెల్ ప్రాంతంలోని ఈ బురదరాళ్లు ఇప్పటికే 2024లో శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. ఆ సమయంలో పర్సివీరెన్స్ రోవర్ వాటి ఉపరితలంపై భూమిపై శిలాజ సూక్ష్మజీవుల వల్ల ఏర్పడే నిర్మాణాలను పోలి ఉండే అసాధారణ మచ్చలు, గుండ్రని ఆకృతులను గుర్తించింది. ఆ పరిశోధన ఫలితాలు గత ఏడాది ప్రచురితమైన తర్వాత, నాసా మాజీ తాత్కాలిక అధిపతి సీన్ డఫీ మాట్లాడుతూ, అంగారక గ్రహంపై ఇప్పటివరకు లభించిన జీవం ఆనవాళ్లలో ఇదే అత్యంత స్పష్టమైన సంకేతం కావచ్చని వ్యాఖ్యానించారు. తాజా అధ్యయనంలో మర్ఫీ బృందం పర్సివీరెన్స్ రోవర్లోని షెర్లాక్ పరికరం నుంచి అతినీలలోహిత (అల్ట్రావయొలెట్) లేజర్ కిరణాలను రాళ్లపై ప్రసరించి, తిరిగి ప్రతిఫలించిన కాంతిని విశ్లేషించడం ద్వారా ఈ సంక్లిష్ట కార్బన్ను గుర్తించింది.
వివరాలు
బురదరాళ్లు గుర్తింపు..
చేయావా ఫాల్స్ పేరుతో ఉన్న ఒక బురదరాయిపై నిర్వహించిన పరీక్షల్లో దాని ఉపరితలంపై మ్యాక్రోమాలిక్యులర్ కార్బన్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ రాయి ఇటీవలే అంగారక గ్రహ ఉపరితలంపై బయటపడిందా, లేదా సాధారణంగా సేంద్రియ పదార్థాలను నాశనం చేసే రేడియేషన్, రసాయనిక ఆక్సీకరణ ప్రక్రియలను తట్టుకుని ఈ కార్బన్ నిలిచి ఉందా అనే అంశాలపై శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఈ తాజా ఆవిష్కరణతో నాసా రోవర్లు అంగారక గ్రహంపై 2 వేల మైళ్లకు పైగా దూరంలో ఉన్న రెండు వేర్వేరు ప్రాంతాల్లో సేంద్రియ పదార్థాలు కలిగిన బురదరాళ్లను గుర్తించినట్లైంది. అంతకుముందు క్యూరియాసిటీ రోవర్ గేల్ క్రేటర్లో ఇలాంటి ఆధారాలను గుర్తించింది. ఈ విషయాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడయ్యాయి.
వివరాలు
ఆ గ్రహంపై జీవం మనుగడ..
బిలియన్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంలోని అనేక ప్రాంతాలు జీవం మనుగడకు అనుకూలంగా ఉండి ఉండవచ్చని, సేంద్రియ పదార్థాలు కూడా విస్తృతంగా ఉండి ఉండే అవకాశముందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొనని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రహ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ బ్రిడ్జెస్ మాట్లాడుతూ, జెజెరో క్రేటర్లోని బ్రైట్ ఏంజెల్ ప్రాంతంపై ఈ తాజా ఫలితాలు మరింత ఆసక్తికరమైన సమాచారాన్ని అందించాయని చెప్పారు. ప్రాథమిక జీవరూపాలు నివసించడానికి అనుకూలమైన వాతావరణం అక్కడ ఒకప్పుడు ఉండేదని ఇప్పటికే గుర్తించామని, జీవం ఉండే అవకాశాన్ని సూచించే నిర్మాణాలతో పాటు, జీవం ఉండి ఉంటే అవసరమైన కార్బన్ మూలకాలకు సంబంధించిన అవశేషాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.
వివరాలు
రాతి నమూనాలు తీసుకొచ్చేందుకు నాసా ప్రణాళిక..
అయితే ఈ సంక్లిష్ట కార్బన్ పురాతన అంగారక సూక్ష్మజీవుల నుంచి వచ్చిందా, లేక జీవేతర భౌగోళిక ప్రక్రియల వల్ల ఏర్పడిందా అనే విషయాన్ని పర్సివీరెన్స్ రోవర్ మాత్రమే నిర్ధారించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తుది సమాధానం భూమిపై ప్రయోగశాలల్లో నిర్వహించే పరీక్షల ద్వారానే లభించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఇందుకోసం అంగారక గ్రహం నుంచి రాతి నమూనాలను భూమికి తీసుకురావాలని నాసా ప్రణాళిక రూపొందించినప్పటికీ, ఆ మిషన్ను ఈ ఏడాది జనవరిలో వాస్తవానికి విరమించారు. ప్రస్తుతం 2030వ దశకంలో కొత్త ప్రణాళికతో ఆ మిషన్ను చేపట్టే ప్రయత్నాలు జరుగుతుండగా, చైనా మాత్రం 2031లో తన సొంత అంగారక నమూనాలను భూమికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.