చంద్రయాన్-3 టెక్నాలజీని పంచుకోవాలని ఇస్రోను కోరిన నాసా
చంద్రయాన్-3 ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశం కొత్త చరిత్రను రాసింది. అత్యంత తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని భారత ప్రభుత్వం ఎంతగానో మెచ్చుకుంది. కేవలం మన దేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాలు సైతం ఇస్రో శాస్త్రవేత్తల కృషిని చూసి ఆశ్చర్యపోయాయి. తాజాగా చంద్రయాన్-3 టెక్నాలజీని పంచుకోవాలని నాసా శాస్త్రవేత్తలు అడిగినట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడి చేశారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలో జరుగుతున్న ఒకానొక కార్యక్రమంలో ఇస్రో చీఫ్ సోమనాథ్ మాట్లాడారు.
చంద్రయాన్ 3 టెక్నాలజీని అడిగిన నాసా శాస్త్రవేత్తలు
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన తర్వాత నాసా నుండి ఆరుగురు శాస్త్రవేత్తలు వచ్చారని సోమనాథ్ చెప్పుకొచ్చారు. చంద్రయాన్-3 ప్రయోగం రూపకల్పన, దానికోసం ఇంజనీర్లు పడిన కష్టం మొదలగు విషయాలను ఆ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారని సోమనాథ్ తెలియజేశారు. తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరికరాలను తయారు చేయడం మొదలగు విషయాలను తెలుసుకొని నాసా శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారని సోమనాథ్ అన్నారు. ఇంకా చంద్రయాన్-3 టెక్నాలజీని తమతో పంచుకోవాలని నాసా శాస్త్రవేత్తలు అడిగారట. ప్రస్తుతం ఇస్రో చీఫ్ సోమనాథ్ మాట్లాడిన మాటలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత సూర్యుడిపై ఆదిత్య ఎల్ వన్ మిషన్ ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగించింది.