NavIC: నావిక్కు ముప్పు.. 11 శాటిలైట్లలో పనిచేస్తున్నవి కేవలం మూడు శాటిలైట్లే
ఈ వార్తాకథనం ఏంటి
భారత్కు చెందిన స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ (NavIC) ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ వ్యవస్థలో ఉన్న 11 శాటిలైట్లలో ఇప్పుడు మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిలో కూడా ఒకటి పదేళ్లకు పైబడిన పాత ఉపగ్రహం కావడంతో, అది ఎప్పుడైనా విఫలమయ్యే ప్రమాదం ఉంది. నావిక్ సమర్థంగా పనిచేయాలంటే కనీసం నాలుగు ఉపగ్రహాలు అవసరం. కానీ ప్రస్తుతం మూడు మాత్రమే అందుబాటులో ఉండటంతో దీని పనితీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత సైన్యం, క్షిపణుల మార్గదర్శక వ్యవస్థ, ఖచ్చితమైన దాడుల సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
వివరాలు
కార్గిల్ యుద్ధం తర్వాత స్వదేశీ నావిగేషన్ అవసరం స్పష్టమైంది
1999 కార్గిల్ యుద్ధం సమయంలో భారతదేశానికి ఖచ్చితమైన జీపీఎస్ సమాచారం అందించేందుకు అమెరికా నిరాకరించింది. ముఖ్యంగా ఎత్తైన కొండప్రాంతాలకు సంబంధించిన కీలక వివరాలను ఇవ్వకపోవడంతో, పాక్ సైనికులపై ఖచ్చితమైన దాడులు జరపడంలో భారత సైన్యానికి ఇబ్బందులు తలెత్తాయి. ఈ అనుభవం తర్వాతే భారత్కు సొంత నావిగేషన్ వ్యవస్థ అవసరం ఎంత ముఖ్యమో స్పష్టమైంది. దాంతో స్వదేశీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
వివరాలు
IRNSSగా ప్రారంభమై NavICగా మారిన వ్యవస్థ
2013 నుంచి 2018 మధ్య ఇస్రో ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) పేరుతో పలు ఉపగ్రహాలను ప్రయోగించింది. తరువాత ఈ వ్యవస్థకు NavIC అనే పేరు పెట్టారు. భారతదేశంతో పాటు చుట్టుపక్కల 1,500 కిలోమీటర్ల పరిధిలో పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ సేవలను ఈ వ్యవస్థ అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాకు జీపీఎస్, చైనాకు బీడౌ, యూరప్కు గెలీలియో, రష్యాకు గ్లోనాస్ వ్యవస్థలు ఉన్నాయి. అవి గ్లోబల్ స్థాయిలో పనిచేస్తున్నాయి.
వివరాలు
అటామిక్ గడియారాల వైఫల్యంతో మొదటి దశలోనే దెబ్బ
ఇస్రో మొత్తం తొమ్మిది ఉపగ్రహాలను ప్రయోగించింది. అందులో ఎనిమిది అంతరిక్షంలోకి చేరాయి. అయితే వీటిలో ఐదు శాటిలైట్లకు చెందిన అటామిక్ గడియారాల్లో సమస్యలు తలెత్తాయి. IRNSS-1A, 1C, 1D, 1E, 1G ఉపగ్రహాల్లో ఈ లోపాలు నమోదయ్యాయి. అటామిక్ గడియారాలు ఉపగ్రహాల్లో అత్యంత కీలక భాగం. ఇవే ఖచ్చితమైన సమయాన్ని అందిస్తాయి. ఒకసారి అవి విఫలమైతే, ఆ శాటిలైట్ నావిగేషన్ సేవలకు పనికిరాకుండా మారుతుంది.
వివరాలు
ఇప్పుడున్న పరిస్థితి మరింత ఆందోళనకరం
ప్రస్తుతం IRNSS-1B, 1F, 1I అనే మూడు ఉపగ్రహాలే మిగిలి ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే ఇందులో IRNSS-1B ఇప్పటికే 11 ఏళ్ల వయస్సు దాటింది. మరోవైపు IRNSS-1Fలో చివరిగా పనిచేస్తున్న అటామిక్ గడియారం కూడా 2026 మార్చి 13న విఫలమైంది. దీంతో ఈ ఉపగ్రహం ఇప్పుడు నావిగేషన్ సేవలకంటే సందేశ సేవలకే పరిమితమైందని ఇస్రో తెలిపింది. అంటే వాస్తవానికి పూర్తి స్థాయి నావిగేషన్ కోసం ఉపయోగపడుతున్నవి రెండు ఉపగ్రహాలే అన్న సందేహం ఉత్పన్నమవుతోంది.
వివరాలు
సెకండ్ జనరేషన్ శాటిలైట్లలోనూ సమస్యలు
ఫస్ట్ జనరేషన్ ఉపగ్రహాల్లో జరిగిన లోపాల నుంచి పాఠాలు నేర్చుకుని ఇస్రో సెకండ్ జనరేషన్ NVS శాటిలైట్లను అభివృద్ధి చేసింది. NVS-01ను 2023 మేలో ప్రయోగించగా అది సక్రమంగా పనిచేస్తోంది. అయితే NVS-02ను 2025 జనవరిలో ప్రయోగించినప్పటికీ, అది అనుకున్న కక్ష్యలోకి వెళ్లకుండా తప్పు కక్ష్యలోనే చిక్కుకుంది. దాన్ని సరిదిద్దేందుకు ఇంజిన్లు ఆన్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. దాంతో నావిగేషన్ సేవలకు అవసరమైన విధంగా అది ఉపయోగపడలేకపోయింది. ఇస్రోకు మొత్తం ఐదు NVS ఉపగ్రహాలు అవసరమవుతున్నాయి. కానీ ప్రస్తుతం వాటిలో ఒకటి మాత్రమే సక్రమంగా పనిచేస్తోంది. మిగిలిన ఉపగ్రహాల ప్రయోగం ఇంకా ఆలస్యమవుతోంది. 2025లో మిగిలిన ఉపగ్రహాలను 2026 నాటికి ప్రయోగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా,ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు.
వివరాలు
అమెరికా, చైనాతో పోలిస్తే భారత్ వెనుకబడిన పరిస్థితి
అమెరికా జీపీఎస్ వ్యవస్థలో మొత్తం 30 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో 24 పనిచేస్తే సరిపోతుంది. చైనా బీడౌ వ్యవస్థలో 35 శాటిలైట్లు ఉన్నాయి. అలాంటి సమయంలో కేవలం నాలుగు ఉపగ్రహాలపై ఆధారపడే భారత నావిక్ వ్యవస్థలో ఇప్పుడు మూడు మాత్రమే పనిచేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది భారత రక్షణ వ్యవస్థకు వ్యూహాత్మకంగా ప్రమాద సంకేతంగా మారుతోంది. అత్యవసర లేదా యుద్ధ పరిస్థితుల్లో విదేశీ జీపీఎస్ వ్యవస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావొచ్చు.
వివరాలు
నావిక్ బలహీనపడితే వచ్చే ప్రమాదాలు ఇవే
నావిక్ వ్యవస్థ బలహీనపడితే సైనిక నావిగేషన్ సేవలు దెబ్బతినే అవకాశం ఉంది. క్షిపణుల మార్గదర్శక వ్యవస్థలపై ప్రభావం పడొచ్చు. శత్రుదేశాలపై ఖచ్చితమైన దాడులు చేయడంలో ఆటంకాలు తలెత్తవచ్చు. సముద్రంలో ఓడలు, గాల్లో విమానాల స్థాన నిర్ధారణలో తప్పిదాలు జరిగే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ నావిక్ పూర్తిగా విఫలమైతే, భారత్ మళ్లీ విదేశీ నావిగేషన్ వ్యవస్థలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.