LOADING...
Blood Test: ఒకే రక్త పరీక్షతో పలురకాల డిమెన్షియా వ్యాధుల గుర్తింపు.. కొత్త అధ్యయనంలో కీలక విషయాలు!
కొత్త అధ్యయనంలో కీలక విషయాలు!

Blood Test: ఒకే రక్త పరీక్షతో పలురకాల డిమెన్షియా వ్యాధుల గుర్తింపు.. కొత్త అధ్యయనంలో కీలక విషయాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిమెన్షియా వంటి మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడంలో వైద్యరంగం మరో ముందడుగు వేసింది. ఒకే రక్తపరీక్ష ద్వారా ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ రకాల డిమెన్షియా వ్యాధులు ఉన్నాయో లేదో తెలుసుకునే కొత్తవిధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష 92.3శాతం కచ్చితత్వంతో ఫలితాలు ఇస్తోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా డిమెన్షియా అనేది ఒకే వ్యాధి కాదని,అల్జీమర్స్,పార్కిన్సన్స్,ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా,లెవీ బాడీస్ డిమెన్షియా వంటి పలు నాడీ సంబంధిత వ్యాధులు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ప్రారంభ దశలో గుర్తించడం వైద్యులకు కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రూపొందించిన కొత్త రక్త పరీక్ష ఒకేసారి నాలుగు ప్రధాన న్యూరోడిజెనరేటివ్ వ్యాధులను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వివరాలు 

అమెరికాలోనే 60 లక్షలకు పైగా డిమెన్షియా కేసులు

ఈ పరీక్షలో రక్తంలోని 15 రకాల ప్రత్యేక ప్రోటీన్లను విశ్లేషిస్తారు. వీటి ఆధారంగా వ్యక్తికి ఏ వ్యాధి ఉందో మాత్రమే కాకుండా, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు ఉంటే వాటి ప్రభావం ఎంత మేర ఉందో కూడా అంచనా వేయగలుగుతారు. ఉదాహరణకు ఒక వ్యక్తిలో అల్జీమర్స్ లక్షణాలు ఎక్కువగా, పార్కిన్సన్స్ లక్షణాలు కొంత మేర ఉంటే వాటిని విడివిడిగా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలోనే 60 లక్షలకు పైగా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం మరణాలకు దారితీసే ప్రధాన కారణాల్లో డిమెన్షియా కూడా ఒకటి. అందువల్ల వ్యాధిని ముందుగానే గుర్తించడం, సరైన చికిత్స అందించడం అత్యంత కీలకంగా మారింది.

వివరాలు 

కృత్రిమ మేధ (AI) సాయంతో రక్త నమూనాల విశ్లేషణ 

ఈ పరిశోధనను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టారు. 3 వేల మందికి పైగా రోగుల రక్త నమూనాలు, వైద్య వివరాలను సేకరించి కృత్రిమ మేధ (AI) సాయంతో విశ్లేషించారు. మొదట 123 ప్రోటీన్లను పరిశీలించిన పరిశోధకులు, చివరకు అత్యంత ప్రభావవంతమైన 15 ప్రోటీన్లను ఎంపిక చేసి ఈ కొత్త పరీక్షను రూపొందించారు. ప్రస్తుతం అల్జీమర్స్ నిర్ధారణలో ఉపయోగిస్తున్న p-tau217 ప్రోటీన్ కూడా ఇందులో భాగమైంది. ఈ పరీక్ష ఫలితాలను మరో పరిశోధనా కేంద్రంలోని రోగులపై కూడా పరీక్షించి, మరణానంతరం మెదడు కణజాల పరీక్షలతో పోల్చి ధృవీకరించారు. దీంతో ఈ విధానం నమ్మకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఈ అంశాలను కూడా వైద్యులు పరిగణనలోకి తీసుకోవాలి 

అయితే కేవలం ఈ రక్త పరీక్ష ఆధారంగానే డిమెన్షియాను నిర్ధారించలేమని నిపుణులు చెబుతున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి, నిద్ర, మానసిక ఒత్తిడి, ఇతర మందుల ప్రభావం, రక్తనాళాల సమస్యలు వంటి అంశాలను కూడా వైద్యులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. GPND-AI పేరుతో రూపొందించిన ఈ కొత్త రక్త పరీక్షను త్వరలో క్లినికల్ ట్రయల్స్‌కు తీసుకెళ్లేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అవసరమైన అనుమతులు లభిస్తే, భవిష్యత్తులో డిమెన్షియా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, రోగికి తగిన వ్యక్తిగత చికిత్స అందించే అవకాశాలు మరింత మెరుగుపడతాయని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement