NHRC-Meta: మెటాపై ఎఫ్ఐఆర్కు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు.. 6 రాష్ట్రాలకు కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వేదికలపై బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన (Child Sexual Abuse Material - CSAM) కంటెంట్ ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. బిహార్, చండీగఢ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ రాష్ట్రాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు మెటా ప్లాట్ఫార్మ్స్పై పోక్సో (POCSO) చట్టం-2012 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. న్యూస్18 కథనం ప్రకారం, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది.
వివరాలు
ఎన్హెచ్ఆర్సీ పరిశీలనకు ఫిర్యాదు
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అశ్లీలమైన, పిల్లలకు అనుచితమైన కంటెంట్కు సంబంధించిన లింకులు ఉన్నాయని, వాటిలో బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన సమాచారం ఉండే అవకాశం ఉందని ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ పరిశీలనకు తీసుకుంది.
ఆ సంస్థ దర్యాప్తు కోసం మాత్రమే లింకులను జత చేసిందని, వాటిని తాము ఓపెన్ చేయలేదని, డౌన్లోడ్ చేయలేదని, భద్రపరచలేదని స్పష్టం చేసింది.
పోక్సో చట్టం-2012, ఐటీ చట్టం-2000 నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు తెలిపింది.
వివరాలు
నేరం జరిగినట్లు తేలితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
ఆగస్టు 3న జారీ చేసిన నోటీసులో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల డీజీపీలు, అలాగే మెటా ఇండియా లా ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతి ఒక వారంలోపు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక (Action Taken Report) సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.
పోలీసు శాఖలు తమ సైబర్ క్రైమ్ విభాగాలు లేదా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ల ద్వారా సంబంధిత యూఆర్ఎల్లను పరిశీలించాలని సూచించింది.
నేరం జరిగినట్లు తేలితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అలాగే MeitY, మెటా, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB)లతో సమన్వయం చేసుకోవాలని పేర్కొంది.
వివరాలు
నేరం జరిగినట్లు తేలితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
గుర్తించిన బాల బాధితులను వెంటనే రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపర్చాలని కూడా సూచించింది.
MeitYకు సంబంధిత యూఆర్ఎల్లను బ్లాక్ చేయడంపై, మధ్యవర్తి సంస్థపై తీసుకున్న చర్యలపై, భవిష్యత్తులో పిల్లల భద్రత కోసం చేపట్టే చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
మెటా మాత్రం సంబంధిత కంటెంట్ను తొలగించడం, మెటాడేటా, ఐపీ లాగ్లను భద్రపరచడం, పోక్సో చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం నివేదించడం, ఇలాంటి ఘటనలు జరగకుండా అమలు చేస్తున్న భద్రతా వ్యవస్థల వివరాలు అందించాలని సూచించింది.
వివరాలు
బీబీసీ కథనం తర్వాత దర్యాప్తు వేగం
జూలై 8న బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రచురించిన కథనాన్ని ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే సుమోటోగా స్వీకరించింది.
ఆ కథనం ప్రకారం, ఇన్స్టాగ్రామ్లో చెల్లింపు ప్రకటనల ద్వారా "రేప్ వీడియో", "చైల్డ్ వీడియో" వంటి పదాలను ఉపయోగించి సీఎస్ఏఎం కంటెంట్ను ప్రచారం చేశారని, వాటి ద్వారా వినియోగదారులను టెలిగ్రామ్ ఛానళ్లకు మళ్లించి విక్రయానికి ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ప్రకటనలు మెటా సమీక్ష వ్యవస్థ ఆమోదం పొందిన తర్వాతే ప్రచురితమయ్యాయని, ప్లాట్ఫార్మ్లో ఫిర్యాదు చేసినప్పటికీ తొలగించలేదని, బీబీసీ నేరుగా కంపెనీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మాత్రమే స్పందించిందని నివేదికల్లో పేర్కొన్నారు.
వివరాలు
బీబీసీ కథనం తర్వాత దర్యాప్తు వేగం
ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ కేసును ప్రాధాన్యంగా తీసుకుని విచారణ ప్రారంభించారు.
పోక్సో చట్టం-2012తో పాటు ఇతర వర్తించే చట్టాల కింద మెటాపై ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని బెంచ్ మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993లోని సెక్షన్ 12 ప్రకారం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది.
జూలైలో జారీ చేసిన నోటీసులో ప్రకటనల రికార్డులు, మెటాడేటా, ఆర్థిక లావాదేవీల ఆధారాలను భద్రపరచాలని, ప్రకటనదారులు, నిందితులు, బాల బాధితులను గుర్తించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
వివరాలు
బీబీసీ కథనం తర్వాత దర్యాప్తు వేగం
అలాగే పోక్సో చట్టంలోని సెక్షన్లు 19, 20 ప్రకారం మెటా తప్పనిసరి నివేదనా బాధ్యతలను పాటించిందా లేదా అన్న అంశాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది.
ఈ కేసులో చట్టంలోని సెక్షన్ 23(3) ప్రకారం కూడా బాధ్యతలు ఉండే అవకాశం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.
"జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ వర్సెస్ ఎస్. హరీష్ అండ్ అదర్స్" కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించిన ఎన్హెచ్ఆర్సీ, ఇలాంటి అనుమానాస్పద పోక్సో కేసులను మధ్యవర్తి సంస్థలు తప్పనిసరిగా NCMECతో పాటు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని మరోసారి గుర్తు చేసింది.
వివరాలు
చర్యల నివేదిక ఆలస్యం.. మరో హెచ్చరిక
జూలై 29న నిర్ణీత 15 రోజుల గడువులోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించకపోవడంతో ఢిల్లీ పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ మరోసారి రిమైండర్ పంపింది.
మరో ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993లోని సెక్షన్ 13 ప్రకారం కమిషన్ తన ప్రత్యేక అధికారాలను వినియోగించాల్సి వస్తుందని హెచ్చరించింది.
బాలల లైంగిక దుర్వినియోగ కంటెంట్ తయారీ లేదా దాని ప్రసారం కొనసాగడం ప్రతి సందర్భంలోనూ చిన్నారుల గౌరవం, గోప్యత, మానవ హక్కుల ఉల్లంఘనగానే పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.
బాధిత పిల్లలను వెంటనే రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొంది.
వివరాలు
ఎన్సీపీసీఆర్ ప్రత్యేక విచారణ
మరోవైపు, మెటా ప్లాట్ఫార్మ్లలో బాలల లైంగిక దోపిడీ, దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ ఉందన్న ఆరోపణలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) కూడా ప్రత్యేక విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
జూలై 3న బీబీసీ ఐ రిపోర్ట్ ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్, మెటాకు నోటీసులు జారీ చేసింది.
ఆ నోటీసుకు వారం రోజుల్లోపే మెటా తన వివరణను సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.