LOADING...
Pegasus Spyware: పెగాసస్‌పై విచారణ చేసిన ఎంపీ ఫోన్‌ను హ్యాక్ చేసిన స్పైవేర్
ఎన్‌ఎస్‌వోలో ఓ అమెరికన్ పెట్టుబడి సంస్థ కోట్లాది డాలర్లు పెట్టుబడి

Pegasus Spyware: పెగాసస్‌పై విచారణ చేసిన ఎంపీ ఫోన్‌ను హ్యాక్ చేసిన స్పైవేర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తున్న యూరోపియన్ రాజకీయ నాయకుడి ఫోన్‌నే అదే పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేసినట్లు భద్రతా పరిశోధకులు నిర్ధారించారు. ఈ ఘటనతో ప్రభుత్వాలు తమ విమర్శకులపై స్పైవేర్‌ను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయానికి చెందిన డిజిటల్ హక్కుల పరిశోధనా సంస్థ సిటిజన్ ల్యాబ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రీకు జర్నలిస్టు, మాజీ రాజకీయ నాయకుడు స్టెలియోస్ కౌలోగ్లూ 2022, 2023 సంవత్సరాల్లో పెగాసస్ స్పైవేర్ దాడికి గురయ్యారు. యూరోపియన్ ప్రభుత్వాల స్పైవేర్ దుర్వినియోగంపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన యూరోపియన్ పార్లమెంట్ PEGA కమిటీ సభ్యుడు స్పైవేర్ బారిన పడినట్లు బహిరంగంగా నిర్ధారణ కావడం ఇదే తొలిసారి అని పరిశోధకులు తెలిపారు.

వివరాలు 

ఎంపీలు లేదా శాసనసభ్యులపై చాలా అరుదుగా స్పైవేర్ దాడులు

తన ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగా హ్యాక్ చేయడం అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య అని కౌలోగ్లూ వ్యాఖ్యానించారు. మరో యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు ఈ ఘటనను "ప్రజాస్వామ్య పాలనపై నేరుగా జరిగిన దాడి"గా అభివర్ణిస్తూ, యూరోపియన్ కమిషన్ స్పైవేర్ వినియోగంపై కఠిన పరిమితులు విధించాలని డిమాండ్ చేశారు. ఎంపీలు లేదా శాసనసభ్యులపై స్పైవేర్ దాడులు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే, స్పైవేర్ దుర్వినియోగాన్ని దర్యాప్తు చేస్తున్న కమిటీ సభ్యుడినే అదే స్పైవేర్‌తో లక్ష్యంగా చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కమిటీ నివేదిక విడుదలకు ముందే దాని అంతర్గత కార్యకలాపాలపై సమాచారం సేకరించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

యూరప్‌లోని పలు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించిన ఒక పెగాసస్ వినియోగదారుడు

సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు ఈ హ్యాకింగ్‌కు ఏ దేశ ప్రభుత్వం బాధ్యత వహించిందో స్పష్టంగా చెప్పలేదు. అయితే, గతంలో యూరప్‌లో పలువురు జర్నలిస్టులపై జరిగిన పెగాసస్ దాడుల్లో ఉపయోగించిన అదే ఈ-మెయిల్ చిరునామాను ఈ దాడిలో కూడా వినియోగించినట్లు గుర్తించారు. దీంతో ఒక పెగాసస్ వినియోగదారుడు యూరప్‌లోని పలు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించాలని టెక్‌క్రంచ్ చేసిన విజ్ఞప్తికి యూరోపియన్ కమిషన్ స్పందించలేదు. అలాగే పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్ కూడా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

Advertisement

వివరాలు 

"జీరో-క్లిక్" పద్ధతిలో దాడి

సిటిజన్ ల్యాబ్ నివేదిక ప్రకారం.. 2022 అక్టోబర్‌లో ఒకసారి, 2023 మార్చిలో కనీసం రెండుసార్లు కౌలోగ్లూ ఐఫోన్‌పై పెగాసస్ దాడి జరిగింది. అప్పటికే ఆపిల్ భద్రతా లోపానికి పరిష్కారం విడుదల చేసినప్పటికీ, ఆ అప్‌డేట్ ఆయన ఫోన్‌లో ఇంకా ఇన్‌స్టాల్ కాలేదు. ఈ దాడి "జీరో-క్లిక్" పద్ధతిలో జరిగింది. అంటే వినియోగదారు ఎలాంటి లింక్ నొక్కకుండానే లేదా ఎలాంటి చర్య తీసుకోకుండానే స్పైవేర్ ఫోన్‌లోకి చొరబడి సమాచారాన్ని సేకరించింది. ఈ భద్రతా లోపాన్ని ఉపయోగించి ఫోన్‌లోని వ్యక్తిగత సందేశాలు, ఇతర సంభాషణలు, లొకేషన్ వివరాలు, ఫొటోలు వంటి గోప్యమైన సమాచారాన్ని వినియోగదారుడికి తెలియకుండా సేకరించినట్లు నివేదిక పేర్కొంది.

Advertisement

వివరాలు 

ఈ దేశాల్లో జరిగిన స్పైవేర్ దుర్వినియోగంపై కమిటీ తొలి ముసాయిదా నివేదిక

2022 అక్టోబర్‌లో జరిగిన హ్యాకింగ్ సమయం కూడా కీలకంగా మారింది. అదే సమయంలో సైప్రస్, గ్రీస్, హంగేరీ, పోలాండ్, స్పెయిన్ దేశాల్లో జరిగిన స్పైవేర్ దుర్వినియోగంపై కమిటీ తొలి ముసాయిదా నివేదిక సిద్ధమవుతోంది. ఆ కాలంలో కమిటీ సభ్యుల మధ్య విస్తృతంగా ఈ-మెయిళ్లు, సందేశాల ద్వారా చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో కౌలోగ్లూ ముందస్తుగా నిర్ణయించిన శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నారని నివేదిక తెలిపింది. ఈ సమయంలో స్పైవేర్ ద్వారా ఆయన చుట్టూ జరిగిన సంభాషణలను కూడా వినే అవకాశం హ్యాకర్లకు లభించి ఉండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు.

వివరాలు 

2023 మార్చి 6, 7 తేదీల్లో ఫోన్‌ హ్యాక్ 

తర్వాత 2023 మార్చి 6, 7 తేదీల్లో ఏథెన్స్ నుంచి బ్రస్సెల్స్‌కు ప్రయాణిస్తున్న సమయంలో కూడా అదే పెగాసస్ ఆపరేటర్ మరోసారి ఆయన ఫోన్‌ను హ్యాక్ చేసినట్లు సిటిజన్ ల్యాబ్ వెల్లడించింది. ఆ సమయంలో కమిటీ కీలక విచారణలు కొనసాగుతుండగా,తుది నివేదిక రూపొందించే ప్రక్రియ కూడా జరుగుతోంది. తనను ఎందుకు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారో తెలియదని, అయితే పెగాసస్ దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తున్న కమిటీలో పనిచేయడమే దీనికి కారణమై ఉండొచ్చని కౌలోగ్లూ అభిప్రాయపడ్డారు. తన ఫోన్ హ్యాక్ అయిన విషయం తెలుసుకున్నప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యానని ఆయన చెప్పారు. వృత్తిపరమైన సమాచారమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంతోషకరమైన, విషాదకరమైన జ్ఞాపకాలు కూడా ఇతరుల చేతికి వెళ్లి ఉండొచ్చనే ఆలోచన కలచివేసిందని పేర్కొన్నారు.

వివరాలు 

ఎన్‌ఎస్‌వోలో ఓ అమెరికన్ పెట్టుబడి సంస్థ కోట్లాది డాలర్ల పెట్టుబడి

ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కౌలోగ్లూ వెల్లడించారు. మానవ హక్కులకు భంగం కలిగించే స్పైవేర్ వినియోగంపై అమెరికాలో ఇప్పటికే ఎన్‌ఎస్‌వోపై కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గత ఏడాది ఎన్‌ఎస్‌వోలో ఓ అమెరికన్ పెట్టుబడి సంస్థ కోట్లాది డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు కూడా సమాచారం వెలుగులోకి వచ్చింది. మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో దెబ్బతిన్న సంస్థ ప్రతిష్ఠను మెరుగుపర్చే ప్రయత్నంలో భాగంగానే ఈ పెట్టుబడులు వచ్చినట్లు భావిస్తున్నారు. తన అనుభవాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, అవినీతికి వ్యతిరేక పోరాటమేనని కౌలోగ్లూ తెలిపారు. "అవినీతి అనేది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే సమస్య"అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement