Planet Parade 2026: నేడు ఆకాశంలో ఒకే వరుసలోకి 4 గ్రహాలు.. భారత్లో ఎప్పుడు,ఎలా చూడాలి?
ఈ వార్తాకథనం ఏంటి
ఖగోళ సంఘటనలపై ఆసక్తి ఉన్నవారికి ఈ వారం అరుదైన అంతరిక్ష అద్భుతం కనిపించనుంది. బుధుడు, కుజుడు (మంగళ), శని, వరుణుడు (నెప్ట్యూన్) ఒకే వరుసగా ఆకాశంలో కనిపించబోతున్నారు. ఈ విశేష దృశ్యం ఏప్రిల్ 23 వరకు కనిపిస్తుండగా, ఏప్రిల్ 18 నుంచి 20 మధ్య చూడటానికి ఉత్తమ సమయం. సూర్యోదయానికి ముందు తూర్పు దిశలో ఈ గ్రహాల వరుస స్పష్టంగా కనిపిస్తుంది. భారత్లో ఉదయం సుమారు 5 నుంచి 5:45 గంటల మధ్య, ఆకాశం స్వచ్ఛంగా ఉంటే ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలంటే తూర్పు వైపు అడ్డంకులు లేని ప్రదేశంలో నిలబడి గమనించాలి.
వివరాలు
గ్రహాలు ఒకే వరుసలో కనిపించడానికి కారణమేంటి?
ఈ నాలుగు గ్రహాలు క్షితిజానికి వేర్వేరు ఎత్తుల్లో ఒక వరుసలో కనిపిస్తాయి. బుధుడు కింద భాగంలో ఉంటాడు, శని కొంచెం పైగా పసుపు రంగు వెలుగుతో మెరిసిపోతాడు. కుజుడు ఎరుపు-నారింజ రంగుతో స్పష్టంగా కనిపిస్తాడు. అయితే వరుణుడు మాత్రం చాలా మసకగా ఉండటం వల్ల టెలిస్కోప్ లేకుండా చూడటం కష్టం. భూమి నుంచి చూస్తే ఈ గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ నిజానికి అవన్నీ లక్షల కిలోమీటర్ల దూరంలో విడివిడిగా ఉంటాయి. గ్రహాలు సూర్యుని చుట్టూ ఒకే సమతల మార్గంలో పరిభ్రమించడంతో, భూమి నుంచి చూస్తే అవి ఒకే వరుసలో కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది.