Ring of fire: అంటార్కిటికాలో రింగ్ ఆఫ్ ఫైర్'.. వైరల్ అవుతున్న ఫోటోలు
ఈ వార్తాకథనం ఏంటి
అంటార్కిటికా నుంచి కనిపించిన అరుదైన "రింగ్ ఆఫ్ ఫైర్" సూర్య గ్రహణం దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 17న జరిగిన ఈ వార్షిక సూర్యగ్రహణాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (European Space Agency) అంతరిక్షం నుంచే చిత్రీకరించింది. వారి PROBA-2 ఉపగ్రహం తీసిన ఫోటోలను తాజాగా విడుదల చేసింది. భూమిపై నుంచి ఈ గ్రహణాన్ని చూడటం చాలా కష్టమైందని అధికారులు తెలిపారు. ఎందుకంటే ఇది కేవలం అంటార్కిటికా ప్రాంతంలో, అలాగే దాని తీర ప్రాంతాల్లో మాత్రమే కనిపించింది.
వివరాలు
"పర్ఫెక్ట్ రింగ్ ఆఫ్ ఫైర్"
భూమిపై అత్యుత్తమ వీక్షణ స్థలంగా గుర్తించిన కాన్కార్డియా స్టేషన్(Concordia Station) నుంచీ కూడా ప్రత్యేక చిత్రాలు విడుదలయ్యాయి. అక్కడ నుంచి సుమారు రెండు నిమిషాల పాటు ఆకాశంలో అగ్నివలయం లా మెరిసిన సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రుడు భూమి చుట్టూ అండాకార కక్ష్యలో కొంచెం దూరంగా ఉండటంతో సూర్యుడిని పూర్తిగా కప్పలేకపోయాడని, అందుకే సూర్యుడి చుట్టూ అగ్నివలయం లాంటి వలయం కనిపించిందని ఈఎస్ఏ వివరించింది. ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతూ నాలుగు సార్లు ఈ గ్రహణాన్ని చిత్రీకరించిందని, 11:31 యూనివర్సల్ టైమ్కు "పర్ఫెక్ట్ రింగ్ ఆఫ్ ఫైర్" ఏర్పడిందని వెల్లడించింది.
వివరాలు
చిలీ, అర్జెంటీనా దక్షిణ భాగాలు, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం
ఇక రింగ్ ఆఫ్ ఫైర్ గ్రహణం ఎందుకు జరుగుతుందంటే, ఆ సమయంలో చంద్రుడు ఆకాశంలో సూర్యుడికంటే కొంచెం చిన్నగా కనిపిస్తాడు. చంద్రుడు సూర్యుడు, భూమి మధ్యలోకి వచ్చినా సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. దీంతో సూర్యుడి చుట్టూ వెలుగుల వలయం ఏర్పడుతుంది. అందుకే దీనిని "రింగ్ ఆఫ్ ఫైర్" అని పిలుస్తారు. ఇదే సమయంలో చిలీ, అర్జెంటీనా దక్షిణ భాగాలు, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించింది.
వివరాలు
మార్చి 3న పూర్తి చంద్రగ్రహణం
మరోవైపు, మార్చి 3న పూర్తి చంద్రగ్రహణం సంభవించనుంది. భూమి నీడ చంద్రుడిపై పడటంతో చంద్రుడు ఎర్రటి రంగులోకి మారతాడు. దీనినే "బ్లడ్ మూన్" అని అంటారు. ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ దీవులు, అమెరికా ప్రాంతాల్లో ఇది కొంతవరకు కనిపించనుంది. ఇక ముందున్న మూడు సూర్యగ్రహణాలు ఆగస్టు 12, 2026,ఆగస్టు 2, 2027 తేదీల్లో పూర్తిస్థాయి సూర్యగ్రహణాలుగా, అదే విధంగా జనవరి 26, 2028న మరోసారి 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం ఆకాశంలో కనువిందు చేయనుంది.