Space X: గ్రహాంతరాలపై మహాస్వప్నం... స్పేస్ఎక్స్ ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
మీ కలలు చాలా పెద్దవిగా ఉన్నాయేమోనని ఎప్పుడైనా భయపడుతున్నారా? మీ వద్ద ఆశలు, లక్ష్యాలు తప్ప మరేమీ లేవని ఆందోళన చెందుతున్నారా? అయితే స్పేస్ఎక్స్ ప్రయాణం గురించి తెలుసుకోవాలి. నేడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఈ సంస్థ, రాబోయే రోజుల్లో సుమారు రూ.165 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకునే స్థాయికి చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచి, అత్యంత విలువైన సంస్థల సరసన చోటు సంపాదించబోతోంది. అదే సమయంలో దాని వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి లక్ష కోట్ల డాలర్ల సంపదను అధిగమించే వ్యక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
వేల కోట్ల పెట్టుబడులు..
అయితే ఈ విజయాలన్నిటికీ మూలం, పదహారేళ్ల క్రితం ఒక సాధారణ వ్యక్తి మనసులో పుట్టిన అసాధారణ కల. అది కేవలం సంపద గురించి కాదు.. భూమికి అవతల మరో ప్రపంచాన్ని నిర్మించాలనే అద్భుతమైన లక్ష్యం. ఎలాన్ మస్క్ స్వభావం గురించి చాలామందికి తెలిసిన విషయమే. ఆయన కఠినమైన నాయకుడు. కానీ 2008 ఆగస్టు 3న జరిగిన ఒక సమావేశంలో మాత్రం ఆయన పూర్తిగా భిన్నంగా కనిపించాడు. ఆ రోజు ఉదయం స్పేస్ఎక్స్ అభివృద్ధి చేసిన ఫాల్కన్-1 రాకెట్ ప్రయోగం విఫలమైంది. లక్ష్య కక్ష్యను చేరకముందే రాకెట్ పేలిపోయింది. ఇదే తరహా వైఫల్యం వరుసగా మూడోసారి జరగడం సంస్థకు భారీ దెబ్బగా మారింది. వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు నష్టపోయాయి.
వివరాలు
మస్క్ ఏం మాట్లాడారంటే..
ఉద్యోగులను ఉద్దేశించి మస్క్ మాట్లాడాడు.. "స్నేహితులారా... స్పేస్ఎక్స్ కోసం నా దగ్గర ఉన్న ప్రతిదాన్ని పెట్టాను. డబ్బు మాత్రమే కాదు, నా సమయం, భావోద్వేగాలు, జీవిత లక్ష్యాలు అన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి. ఒక గొప్ప ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించాను. కానీ మూడు ప్రయత్నాల్లోనూ రాకెట్ను కక్ష్యలోకి పంపడంలో విఫలమయ్యాం. ఆర్థికంగా కూడా చాలా క్లిష్టమైన స్థితికి చేరుకున్నాం. సంస్థ కొనసాగుతుందా లేదా అన్న సందేహం ఏర్పడింది. ఈ వైఫల్యానికి మిమ్మల్ని బాధ్యుల్ని చేయడం లేదు. మీ నిబద్ధత, మీ ప్రతిభ, మీరు చేసిన కృషి నాకు తెలుసు. మనకు ఆరువారాల సమయం మాత్రమే ఉంది. ఈసారి విజయం సాధించాలా, లేక పూర్తిగా ఓడిపోవాలా అన్నది తేలిపోతుంది," అని ఆయన చెప్పాడు.
వివరాలు
కలచివేసిన ఆ సంఘటన..
ఆ మాటలు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అందరూ మరింత పట్టుదలతో పనిలో నిమగ్నమయ్యారు. అయితే పరిస్థితులు అంత సులభంగా లేవు. ముందున్న మార్గం అనేక కఠిన సవాళ్లతో నిండిపోయి ఉంది. ఈ సంఘటనకు ఎనిమిదేళ్ల ముందు కథ మొదలవుతుంది. 1999లో ఎలాన్ మస్క్ ప్రారంభించిన పేపాల్ సంస్థ చాలా తక్కువ సమయంలోనే విశేష విజయాన్ని సాధించింది. బ్యాంకింగ్ సేవలను ఆన్లైన్ ప్రపంచానికి పరిచయం చేసిన తొలి ప్రముఖ సంస్థలలో అది ఒకటి. అయినప్పటికీ సంస్థలోని కొంతమంది భాగస్వాములు మస్క్కు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఫలితంగా ఆయన సీఈఓ పదవిని మాత్రమే కాదు, సంస్థలోని తన స్థానాన్నీ కోల్పోయాడు. ఆ సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది.