Loading...
OpenRouter: ఓపెన్‌రూటర్‌ను రూ.7.5 బిలియన్లకు కొనుగోలు చేయనున్న స్ట్రైప్
ఓపెన్‌రూటర్‌ను రూ.7.5 బిలియన్లకు కొనుగోలు చేయనున్న స్ట్రైప్

OpenRouter: ఓపెన్‌రూటర్‌ను రూ.7.5 బిలియన్లకు కొనుగోలు చేయనున్న స్ట్రైప్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 20, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

చెల్లింపుల రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న స్ట్రైప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కొత్త సంస్థ ఓపెన్‌రూటర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మేధస్సు నమూనాల మార్కెట్‌లోకి ప్రవేశించాలన్న స్ట్రైప్ వ్యూహంలో భాగంగానే ఈ కొనుగోలు చేపడుతోంది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలను సంస్థలు వెల్లడించలేదు. అయితే ఈ కొనుగోలు విలువ సుమారు 7.5 బిలియన్ డాలర్లు ఉండొచ్చని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఓపెన్‌రూటర్ కేవలం మూడు నెలల క్రితమే 113 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించింది. ఆ సమయంలో ఆ సంస్థ విలువ సుమారు 1.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంత తక్కువ వ్యవధిలోనే స్ట్రైప్ భారీ మొత్తానికి ఓపెన్‌రూటర్‌ను కొనుగోలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు

ఉచితంగా లభించే ఏఐ నమూనాలు..

ఏఐ నమూనాలను ఉపయోగించాలనుకునే సాంకేతిక నిపుణుల్లో ఓపెన్‌రూటర్‌కు మంచి ఆదరణ ఉంది.

ముఖ్యంగా ఏ ఒక్క సంస్థకు పరిమితం కాకుండా ఉచితంగా అందుబాటులో ఉండే ఏఐ నమూనాలను ఉపయోగించాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది.

ఓపెన్‌రూటర్‌లో అందుబాటులో ఉన్న ఈ నమూనాల్లో ఎక్కువగా చైనాకు చెందిన డీప్‌సీక్, జెడ్‌.ఏఐ వంటి సంస్థలు అభివృద్ధి చేసిన నమూనాలు ఉన్నాయి.

అమెరికాకు చెందిన ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థల సొంత ఏఐ నమూనాలతో పోలిస్తే వీటిని తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోవచ్చు.

దీంతో తక్కువ వ్యయంతో కృత్రిమ మేధస్సు సేవలను పొందాలనుకునే వారిలో వీటికి ఆదరణ పెరుగుతోంది.

వివరాలు

ఏఐ వినియోగంపై స్ట్రైప్ ఏమంటోంది?

ఓపెన్‌రూటర్ కొనుగోలుపై స్ట్రైప్ తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది.

వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తూ కృత్రిమ మేధస్సు నమూనాల వినియోగానికి అయ్యే ఖర్చును తగ్గించడంతో పాటు, అవసరమైన సమాచారాన్ని సమర్థంగా సరైన నమూనాలకు పంపించే విధానాలపై పనిచేస్తున్నట్లు తెలిపింది.

ఏఐ నమూనాల వినియోగాన్ని కొలిచేందుకు 'టోకెన్' అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు.

అయితే నమూనాల పనితీరుకు అనుగుణంగా వాటి వినియోగ ఖర్చును నియంత్రించడం సవాలుగా మారుతోందని స్ట్రైప్ పేర్కొంది.

కొత్త కృత్రిమ మేధస్సు నమూనాలు వేగంగా అందుబాటులోకి రావడంతోపాటు, వాటి ధరలు కూడా తరచూ మారుతున్నాయని తెలిపింది.

ఈ వేగవంతమైన మార్పుల కారణంగా ఖర్చు, పనితీరు మధ్య సరైన సమతుల్యత సాధించడం కష్టంగా మారుతోందని వివరించింది.

ADVERTISEMENT

వివరాలు

వరుస కొనుగోళ్లతో స్ట్రైప్

ప్రపంచంలో అత్యంత విలువైన కొత్తతరం సంస్థల్లో స్ట్రైప్ ఒకటి. ఈ ఏడాది ప్రారంభంలో ఆ సంస్థ విలువ దాదాపు 160 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

స్ట్రైప్ అందించే అంతర్జాల చెల్లింపుల సాంకేతికతను ప్రపంచంలోని అనేక మార్కెట్లలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

గత ఏడాది స్ట్రైప్ క్రిప్టో కరెన్సీ రంగంలో తన కార్యకలాపాలను కూడా విస్తరించింది.

ఇందులో భాగంగా స్టేబుల్‌కాయిన్ వేదిక బ్రిడ్జ్‌ను 1.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

ఇప్పుడు ఓపెన్‌రూటర్‌ను కొనుగోలు చేయడం ద్వారా కృత్రిమ మేధస్సు రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని స్ట్రైప్ భావిస్తోంది.

ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న ఈ మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటంతో.. అందులో తన వాటాను పెంచుకునేందుకు ఈ కొనుగోలు దోహదపడనుంది.

ADVERTISEMENT

వివరాలు

అనేక నమూనాలు అభివృద్ధి చెందాలి..

స్ట్రైప్‌తో ఒప్పందం తమ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడుతుందని ఓపెన్‌రూటర్ తెలిపింది.

అనేక రకాల ఏఐ నమూనాలు అభివృద్ధి చెందే ఆరోగ్యకరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది.

ఏఐ రంగంలోని ఈ వైవిధ్యమే తమ బలంగా మారాలని ఓపెన్‌రూటర్ కోరుకుంటోంది.

కొత్త ఆవిష్కరణలు చేసే పరిశోధనా సంస్థలు, సాంకేతిక సేవలందించే సంస్థలు తమ అభివృద్ధిని లక్షలాది మంది సాంకేతిక నిపుణులకు చేరువ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపింది.

అదే సమయంలో ఏ ఒక్క కృత్రిమ మేధస్సు నమూనా కూడా ప్రత్యేక కారణం లేకుండా అందరికీ సాధారణ ఎంపికగా మారకూడదని ఓపెన్‌రూటర్ అభిప్రాయపడింది.

ADVERTISEMENT