
Shubhanshu Shukla: భారత్ 'శుభా'రంభం.. రోదసిలోకి శుభాంశు శుక్లా!
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించే మధురఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది భారతీయుల ఆకాంక్షలు, శుభాకాంక్షలతో నిండిన మన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకెగిరారు. ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 రోదసిలోకి ప్రవేశించింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫాల్కన్-9 రాకెట్ విజయవంతంగా ప్రయోగం చేశారు. కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి క్యాప్సుల్ విడిపోయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) దిశగా ప్రయాణం కొనసాగించింది. ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు సార్లు వాయిదా పడింది.
Details
'శుక్స్'గా శుభాంశు శుక్లా అంతరిక్షంలో
అంతేకాకుండా ఈసారి కూడా ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు చిన్న సమస్య తలెత్తినప్పటికీ శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో ప్రయోగం సాఫీగా సాగింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ 'యాక్సియం స్పేస్' ఆధ్వర్యంలో ఈ మిషన్ జరుగుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. శుభాంశు శుక్లా (శుక్స్)తో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్ కపు (హంగరీ), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ (పోలండ్) కూడా రోదసిలోకి వెళ్లారు. శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా సేవలందిస్తున్నారు.
Details
14 రోజుల పాటు ప్రయోగాలు
28 గంటల ప్రయాణం అనంతరం భూమికి 400 కి.మీ ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) శుభాంశు బృందం ఐఎస్ఎస్తో అనుసంధానం అవుతుంది. 14 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉంటూ శుభాంశు బృందం పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా ప్రధాని నరేంద్ర మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.
Details
ఇస్రో తరఫున 7 ముఖ్య ప్రయోగాలు
ఈ రోదసి యాత్ర ద్వారా శుభాంశుకు లభించే అనుభవం 2027లో జరగనున్న స్వదేశీ మానవ రోదసి మిషన్ 'గగన్యాన్'కు ఎంతో ఉపయోగకరమని ఇస్రో తెలిపింది. అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా ఇస్రో తరఫున ఏడు ముఖ్య ప్రయోగాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా దీర్ఘకాల రోదసి యాత్రల్లో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల అభివృద్ధి, భారరహిత స్థితి ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలపై పరిశోధన జరుపుతారు. అంతేకాకుండా, నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు శుక్లా పాల్గొననున్నారు. మొత్తం యాక్సియం-4 మిషన్లో 31 దేశాల శాస్త్రవేత్తలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు జరగనున్నాయి. దీంతో ఒకే మిషన్లో ఐఎస్ఎస్ వద్ద అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు నిర్వహించడం జరుగుతుంది.
Details
41 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం
41 ఏళ్ల తర్వాత భారత పౌరుడు మళ్లీ రోదసిలో తేలియాడనున్నారు. అంతకుముందు 1984లో సోవియట్ యూనియన్ ఇంటర్కాస్మోస్ కార్యక్రమం కింద రాకేశ్ శర్మ సోయుజ్ టీ-11 రోదసి యానం చేసి భారత్కు చరిత్రాత్మక ఘనత తెచ్చారు. ఇప్పుడు శుభాంశు శుక్లా అదే గౌరవాన్ని పునరావృతం చేసి, రోదసిలో భారత్ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించనున్నారు.